Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీల విలీనంపై హైకోర్టు
నవతెలంగాణ - హైదరాబాద్
గ్రామ పంచాయతీల విలీనం, కొత్త పంచాయతీలను ఏర్పాటు చేయటమనేవి ప్రభుత్వ విధాన నిర్ణయాలని హైకోర్టు అభిప్రాయపడింది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం జోగ్యా తండాను గ్రామ పంచాయతీగా ప్రకటించాలంటూ పిటిషనర్ బానోతు నాగేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు అధికారులకు వినతిపత్రం అందజేసేందుకు పిటిషనర్కు మంగళవారం ప్రధాన న్యాయమూర్తి టీబీఎన్ రాధాకష్ణన్, న్యాయమూర్తి రమేష్రంగనాథన్లతో కూడిన డివిజన్ బెంచ్ అనుమతినిచ్చింది. పిటిషనర్ వినతిపై చట్ట ప్రకారం స్పందించాలని అధికారులను బెంచ్ ఆదేశించింది.
ఖైదీల వివరాలు అందజేయండి...
తెలుగు రాష్ట్రాల్లోని కారాగారాల్లో సామర్ధ్యానికి మించి ఖైదీలను ఉంచుతున్నారో లేదో తెలియజేయాలని న్యాయ సేవాధికార సంస్థలను హైకోర్టు ఆదేశించింది. ఖైదీలకు కూడా హక్కులు ఉంటాయని, జైళ్లల్లో వారిని కిక్కిరిసి ఉంచడానికి వీల్లేదంటూ గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలోని 1,382 జైళ్లల్లో చాలా వాటిలో ఖైదీలు సామర్ధ్యానికి మించి ఉన్నారని, పలు జైళ్లలో 150 శాతం ఖైదీలు ఉన్నారనే వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారించి ఉత్తర్వులిచ్చింది. వాటికనుగుణంగా మంగళవారం ప్రధాన న్యాయమూర్తి టీబీఎన్ రాధాకష్ణన్, న్యాయమూర్తి రమేష్రంగనాథన్లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. తెలంగాణలోని జైళ్లలో కిక్కిరిసి ఖైదీల్ని బంధించలేదని ప్రభుత్వ లాయర్ చెప్పారు. ఏపీలో పరిస్థితిని తెలియజేయాలని బెంచ్ ఆదేశిస్తూ విచారణను 31కి వాయిదా వేసింది.
చేపల చెరువులపై వివరణివ్వండి...
ప్రభుత్వ భూములను చెరువులుగా మార్చేసి చేపల్ని పెంచుతున్నారే ఆరోపణలకు వివరణ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే రాజేంద్ర ప్రతాప్ భంజ్దేవ్, ఆయన ఇద్దరు సోదరులతోపాటు విజయనగరం జిల్లా అధికారులకు హైకోర్టు నోటీసులిచ్చింది. పాచిపెంట మండలం విశ్వనాథపురం గ్రామంలో సర్వే నెంబర్ 12/1, 14/2 ల్లోని సర్కార్ భూముల్లో చేపల సాగు చేయడంపై హరిరెడ్డి దాఖలు చేసిన పిల్ను మంగళవారం ప్రధాన న్యాయమూర్తి టీబీఎన్ రాధాకష్ణన్, న్యాయమూర్తి రమేష్ రంగనాథన్లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించి ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది.