Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలల సాహిత్యంపై ఎన్నో పురస్కారాలు అందుకున్న పెండెం
నవతెలంగాణ-చిట్యాల
ప్రభుత్వ ఉపాధ్యాయుడు, బాల సాహితీవేత్త పెండెం జగదీశ్వర్ ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రం రైల్వే ట్రాక్పై మంగళవారం ఆయన మృతదేహం లభ్యమైంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా రామన్నపేటకు చెంది న పెండెం జగదీశ్వర్(42) ఇటీవల జరిగిన ఉపా ధ్యాయుల బదిలీల్లో మునిపంపుల ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి చిట్యాల మండలం చిన్నకాపర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు బదిలీ అయ్యారు. మంగళవారం ఉదయం పాఠశాలకని ఇంట్లో నుంచి బయలుదేరి చిట్యాల శివారులో రైల్వే ట్రాక్పై ఉదయం 11 గంటల సమయంలో పల్నాడు ఎక్స్ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అనుమా నిస్తున్నారు.
జగదీశ్వర్ తెలుగు ఉపాధ్యాయుడిగానే కాకుండా ప్రముఖ బాల సాహితీవేత్తగా, కార్టూ నిస్టుగా, మంచి వక్తగా ప్రశంసలందుకున్నారు. 1994 నుంచి బాలల రచనలు చేస్తున్న జగదీశ్వర్ ఆనంద వక్షం (పర్యావరణ కథల సంపుటి), పసిడిమొగ్గలు, ఉపాయం, గజ్జల దెయ్యం, బాలల కథలు, విడ్డూరాల బుడ్డోడు, నూట పదహారు నవ్వులు, తాను తీసిన గోతిలో, ముగ్గురు అవివేకులు, విముక్తి, ఆంధ్రప్రదేశ్ జానపద కథలు, బడి పిలగాళ్ల కథలు, మాతో పెట్టుకోకు వంటి పుస్తకాలు రచించారు. తెలంగాణ మాండలికంలో పిల్లలు చెప్పుకునే ఇరవై జానపద హాస్యకథలతో బడి పిలగాల్ల కథలు(2015లో) పుస్తకాన్ని రాశారు. ఇది తెలంగాణ మాండలికంలో వచ్చిన తొలి బాలల కథాసంకలనంగా ప్రశంసలందుకుంది. 2005 సంవత్సరానికిగాను 'గజ్జెల దెయ్యం' పుస్తకానికి శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి 'ఉత్తమ బాలసాహితీ గ్రంథం' పురస్కారం అందుకున్నారు. తెలంగాణ మాండలికంలోనే 'గమ్మతి గమ్మతి కథలు(2016), దోస్తులు చెప్పిన కథలు (2018) పుస్తకాలను కూడా ప్రచురించారు. బాలసాహిత్య పరిషత్ 'బాల సాహితీరత్న' పురస్కారంతో ఆయనను గౌరవించింది. సాహితీ మేఖల, అక్షర కళాభారతి, చింతల స్వచ్ఛంద సంస్థలు ఉగాది పురస్కారాలు అందజేశాయి. మహాకవి శ్రీశ్రీ పురస్కారం, వాసాల నరసయ్య బాలసాహిత్య పురస్కారం, గాడేపల్లి యువ సాహిత్య పురస్కారం అందుకున్నారు. ప్రభుత్వ తెలుగు పాఠ్యపుస్తకాల(3వ తరగతి ప్రథమ భాష, 6, 7 తరగతులు ద్వితీయ భాష) రచనలో పాల్గొన్నారు. జగదీశ్వర్ మృతిపట్ల నల్లగొండ ఉమ్మడి జిల్లా సాహితీవేత్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు.