Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిన్న వయసులో పెండ్లీలను ఆపే బాధ్యత అందరిదీ
- లైంగిక దాడికి పాల్పడే వారిని ఉరితీయాలి : చర్చాగోష్టిలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్
- సామాజిక స్పృహ లేని సినిమాలు, సీరియళ్లను నిషేధించాలి : బిఎస్ రాములు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నాణ్యమైన విద్య అందిస్తేనే సమాజంలో బాల్య వివాహాలు నిర్మూలించబడతాయని ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ చెప్పారు. చిన్న వయసులో జరిగే పెండ్లీలను ఆపే బాధ్యత అందరూ తీసుకోవాలని సూచిం చారు. బాల్యవివాహాలు, బాలకార్మికులు, అంటరానితనం లేని తెలంగాణ కావాలని ఆకాంక్షించారు. మహిత, ప్లాన్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ లో 'బాల్యవివాహాల నిర్మూలన'అనే అంశంపై చర్చాగోష్టి జరిగింది. ముఖ్యఅతిధిగా హాజరైన ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ బాల్యవివాహాలపై మహాత్మాజ్యోతిబాఫూలే, సావిత్రిబాయి ఫూలే, గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం ఎంతో పోరాడారని చెప్పారు. మనుషులెవరైనా ఆత్మగౌరవంతో బతకాలని అంబేద్కర్ ఆశించారని గుర్తు చేశారు. కన్న వారు పిల్లలకు త్వరగా పెండ్లి చేయాలని, బాధ్యత తీరిపోతుందనే భావనతో ఉన్నారని చెప్పారు. పిల్లల పెంచే బాధ్యత తీసుకోవాలని, ఉన్నత చదువులు అందించాలని, సమాజంలో గౌరవంగా జీవించేలా తీర్చిదిద్దాలని సూచించారు. ఉన్నత చదువులతోనే సమాజంలో గుర్తింపు వస్తుందని, ఆ కుటుంబం జీవన ప్రమాణాలు మెరుగవుతాయని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లు దాటినా కులవివక్ష కొనసాగుతుందని అన్నారు. గ్రామీణప్రాంతాల్లో, హైదరాబాద్లో లైంగికదాడులు జరిగినా శిక్షలు పడడం లేదన్నారు. చట్టాలున్నా పూర్తిగా అమలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 7,8,10 ఏండ్ల వయస్సున్న బాలికలపై అఘాయిత్యాలు చేసే వారు మనుషులేనా?అని అన్నారు. అలాంటి వారిని ఉరితీయాలని, కఠినంగా శిక్షించాలని చెప్పారు. అప్పుడే అలాంటి తప్పు చేయాలనుకునే వారిలో పరివర్తన వస్తుందని, భయం పుడుతుందని అన్నారు. బాల్యవివాహాలు నిర్మూలించాలని ఎప్పటినుంచో అంటున్నామని, ఇంకా మార్పు రావడం లేదన్నారు. అందరూ సామాజిక బాధ్యత తీసుకోవాలని సూచించారు. సంక్షేమ పథకాలు, ఫలాలు అందిపుచ్చుకోవాలని కోరారు. షాదీముబారక్, కళ్యాణలక్ష్మి వల్ల సరైన వయసులోనే వివాహాలు జరుగుతున్నాయని చెప్పారు. ఆర్థిక సాయం కోసం బాల్యవివాహాలు తగ్గాయని అన్నారు. మహిళలు, పురుషులు సమానమే అంటారు కానీ రెండో పెండ్లి విషయంలో సమానత్వం లేదన్నారు. పురుషునికి రెండో పెండ్లి అంటే తప్పులేదంటూనే అమ్మాయికి రెండో పెండ్లి అంటే చిన్న చూపు చూస్తారని అన్నారు. బాల్యవివాహాలు తప్పు అని, దాని వల్ల అనేక నష్టాలున్నాయని ప్రతి గడపకూ సందేశాన్ని తీసుకెళ్లాలని, సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. కులం, విద్య, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబాటుతనం ఎదగనీయకుండా చేస్తుందని చెప్పారు. బీసీ కమిషన్ చైర్మెన్ బిఎస్ రాములు మాట్లాడుతూ వివాహ చట్టంలోనే సమానత్వం లేదన్నారు. అమ్మాయిలకు 18 ఏండ్లు, అబ్బాయిలకు 21 ఏండ్లు నిర్దేశించడమేంటని ప్రశ్నించారు. అమ్మాయికి 18 ఏండ్లు, అబ్బాయికి 21 ఏండ్లు దాటిన తర్వాతే ప్రేమ సినిమాలకు అనుమతించాలని సూచించారు. లేనిపక్షంలో సినిమా థియేటర్ యజమానిని జైలుకు పంపాలని, అవసరమైన చట్టం తేవాలని అన్నారు. ప్రేమ సినిమాలకు సెన్సార్బోర్డు ఏ సర్టిఫికెట్ ఇవ్వాలన్నారు.
సామాజిక స్పృహ లేని సినిమాలు, సీరియళ్లను నిషేధించాలని అన్నారు. శ్రమను గౌరవించే సమాజం రావాలన్నారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించాలని, సామూహిక వివాహాలు జరగాలని చెప్పారు. మహిత డైరెక్టర్ రమేష్ శేఖర్రెడ్డి మాట్లాడుతూ సామాజిక సంప్రదాయాలు, కుల కట్టుబాట్లు, పేదరికం, నిరక్షరాస్యత, వలసలు, మాధ్యమిక విద్య అందాబుటులో లేకపోవడం, డ్రాపౌట్స్ పెరగడం వల్ల బాల్యవివాహాలు జరుగుతున్నాయని అన్నారు. ప్లాన్ ఇండియా దక్షిణాది రాష్ట్రాల సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ అనితా కుమార్, గొల్లకురుమ నవనిర్మాణ సమితి అధ్యక్షుడు దాసరి నగేష్, విహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జెర్రిపోతుల పరశురాం, ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మేకల నరేందర్, మహిత ప్రతినిధి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.