Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్యూజ్ వైర్లు సరిచేస్తుండగా ఘటనలు
నవతెలంగాణ-ఇల్లంతకుంట/వేములవాడరూరల్
వేర్వేరు ప్రాంతాల్లో ప్రమాదవశాత్తు విద్యుత్షాక్కు గురై ఇద్దరు అసిస్టెంట్ హెల్పర్లు ప్రాణం కోల్పోయారు. ఈ ఘటనలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం జరిగాయి. స్థానికులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి గ్రామానికి మిట్టపెల్లి తిరుపతిరెడ్డి అసిస్టెంట్ హెల్పర్గా పని చేస్తున్నాడు. గ్రామంలోని వ్యవసాయ బావుల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ వైరు వేయడానికి వెళ్లాడు. వైర్ వేసే క్రమంలో విద్యుత్షాక్కు గురై తిరుపతిరెడ్డి(30) అక్కడికక్కడే ప్రాణం కోల్పోయాడు. ఎస్ఐ చంద్రశేఖర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ అరుకుటి విజయలక్ష్మి, ఎంపీటీసీ రాజేశం ప్రభుత్వాన్ని కోరారు. వేములవాడ రూరల్ మండలం ఫాజుల్నగర్ గ్రామానికి చెందిన గొడుగు పర్శరాములు గ్రామంలో అసిస్టెంట్ హెల్పర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతని కొడుకుకి జ్వరం రావడంతో వేములవాడలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. మంగళవారం ఉదయం ఆస్పత్రి నుంచి ఫాజుల్నగర్కు వచ్చాడు. గ్రామంలో ఫ్యూజ్ వైర్ పోయి పాఠశాల వద్ద కరెంట్ సరఫరా లేకపోవడంతో, దాన్ని సరి చేసేందుకు ట్రాన్స్ఫార్మర్ ఎక్కగా ప్రమాదవశాత్తు విద్యుత్షాక్కు గురై పర్శరాములు(30) మృతిచెందాడు. కొడుకు ఇంకా రావడం లేదని తల్లి అక్కడికి వెళ్లి చూడగా పర్శరాములు ట్రాన్స్ఫార్మర్పై చనిపోయి కనిపించాడు. ట్రాన్స్ఫార్మర్ నుంచి పాఠశాల వైపు వెళ్లే విద్యుత్ లైన్కు మెయిన్ వైరు తగలడంతోనే విద్యుత్షాక్ గురై పర్శరాములు మృతిచెందాడని సెస్ అధికారులు తెలిపారు. పోలీసులు, సెస్ అధికారులు ఘటనాస్థలంలో పరిశీలించారు. రూరల్ ఎస్ఐ రమేశ్ నాయక్ కేసు దర్యాప్తు చేపట్టారు. సెస్ చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి, టీపీసీసీ సభ్యులు ఏనుగు మనోహర్రెడ్డి మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. పర్శరాములు కుటుంబాన్ని ఆదుకోవాలని టీపీసీసీ సభ్యులు ఏనుగు మనోహర్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.