Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమీషనర్లను, స్పెషల్ ఆఫీసర్ల ప్రతిపాదనలు సిద్ధం చేయండి
- కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశం
- పలు అంశాలపై సుదీర్ఘ సమీక్ష
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కొత్తగా ఏర్పడిన 68 మున్సిపాల్టీలు ఆగస్టు ఒకటి నుంచి అమలులోకి రాబోతున్నాయని, మున్సిపాల్టీలకు కమీషనర్లు, గ్రామపంచాయతీలో స్పెషల్ ఆఫీసర్ల నియామకాలకు సంబంధించి ప్రతిపాదనలు రెండు రోజుల్లో పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్కే జోషి కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో హరితహారం, మత్స్యశాఖ, పాడి, గేదెల పంపిణీ, వివిధ కేసులకు సంబంధించిన మెడికల్ పోస్టుమార్టమ్ నివేదికలు, లారీల సమ్మె తదితర అంశాలపై ఆయన జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో 12751 గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లు, 565 గ్రామ పంచాయతీ క్లస్టర్లకు ఇన్చార్జీలుగా గ్రామపంచాయతీ సెక్రటరీలను, 68 నూతన మున్సిపాల్టీలకు మున్సిపల్ కమీషనర్లుగా తహశీల్దార్లు, స్పెషల్ ఆఫీసర్లుగా ఆర్డీఓ లేదా జిల్లా స్థాయి అధికారులను నియమించే ప్రతిపాదనలను రూపొందించాలని ఆదేశించారు.
మున్సిపల్ కమీషనర్లు, స్పెషల్ ఆఫీసర్లకు ప్రతిపాదనలు పంపించాలని మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్కుమార్ కోరారు. కొన్ని మండలాలకు ఒకటి కంటే ఎక్కువ పట్టణ స్థానిక సంస్థలు ఉంటే దానికి అనుగుణంగా ప్రత్యేక ప్రతిపాదనలు ఉండాలన్నారు. గ్రామపంచాయతీలోని మినిట్స్ పుస్తకాలను సీజ్ చేసి, కొత్త మినిట్స్ పుస్తకాలను తెరవాలని సూచించారు. కొత్త మున్సిపల్ కార్యాలయాల వద్ద బోర్డులను ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రస్తుతం ఉన్న బ్యాంకు ఖాతాలను మూసివేసి జాతీయ బ్యాంకులలో కొత్తగా ఖాతాలను తెలవాలని కోరారు. మున్సిపాల్టీలలో ప్రధాన రోడ్లు, ట్రాఫిక్ జంక్షన్లు, ముఖ్యమైన ప్రాంతాలలో సుందరీకరణ పనులు చేపడుతున్నామన్నారు.
సమాచార శాఖ ద్వారానే భూసేకరణ ప్రకటనలు
భూసేకరణ ప్రకటనలను సమాచార శాఖ ద్వారానే జారీ చేయాలని, కొంత మంది కలెక్టర్లు నేరుగా భూసేకరణ ప్రకటనలను జారీ చేస్తున్నారని అరవింద్కుమార్ తెలిపారు. ఇక ముందు సమాచార శాఖ ద్వారానే జారీ చేయాలని సూచించారు. బకాయిలు ఉన్న రూ 37 కోట్లు విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు.
పోస్టుమార్టమ్ నివేదికలు క్లియర్ చేయాలి
వివిధ కేసులకు సంబంధించి పోస్టుమార్టమ్ నివేదికలు, మెడికల్ రిపోర్టులు జిల్లాలవారిగా క్లియర్ చేయాలని డీజీపీ మహేందర్రెడ్డి కోరారు. ఇన్వెస్టిగేషన్ను కాలపరిమితిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇట్టి పరిస్థితుల్లో జాప్యం లేకుండా చూడాలన్నారు. ఈ కేసుల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఆర్టీవోల ద్వారా ఫిట్ నెస్ సర్టిఫికేట్స్ జారీ వేగవంతం చేయాలన్నారు.
నిత్యావసర వస్తువుల పంపిణీ కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
ఈ నెల 20 నుంచి లారీల సమ్మెకు ప్రయివేట్ యాజమానులు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీకి ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్శర్మ ఆదేశించారు. సమ్మె విషయంలో లారీల అసోషియేషన్లు రాష్ట్రానికి సంబంధించి లోడింగ్, అన్లోడింగ్ కోసం హమాలీలు అదనంగా కూలీ అడుగుతున్నారని వివరించారు. ఓవర్ లోడింగ్ అరికట్టాలని, డ్రైవింగ్ స్కూల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలన్నారు.
చేప పిల్లల పంపిణీ కోసం చర్యలు
గొర్రెల పంపిణీ మాదిరిగానే చేపపిల్లల పంపిణీ కోసం చర్యలు తీసుకోవాలని పశుసంవర్థక శాఖ కార్యదర్శి సందీప్కుమార్ కోరారు. 21568 వాటర్ బాడీస్లలో దాదాపు 80 కోట్ల చేపపిల్లల పంపిణీ కోసం టెండర్లు పూర్తయ్యాయన్నారు. సప్లయర్ల వెరిఫికేషన్ త్వరలో పూర్తి అవుతుందన్నారు. వచ్చే చేపల ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకొని మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఆగస్టు 15 నాటికి మంజూరు ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు.
పాడిగేదెల పంపిణీకి
ప్రత్యేక అకౌంట్లు ఓపెన్ చేయండి
రాష్ట్రంలో 2.13 లక్షల పాడిగేదెల పంపిణీకి సంబంధించి జిల్లా కలెక్టర్లు ప్రత్యేక అకౌంట్లు ఓపెన్ చేయాలని సందీప్కుమార్ సుల్తానియా కోరారు. ప్రభుత్వం ప్రోత్సహం పొందుతున్న 4 డైరీలకు చెందిన రైతులకు పాడిగేదెలు సబ్సిడీపై అందిస్తామని, లబ్దిదారుల వివరాలు డైరీల వద్ద ఉన్నాయన్నారు. గేదెలకు ఇన్సురెన్స్, రూ 5వేల రవాణా భత్యం, 300 కేజీల దాణా ఇస్తామన్నారు. తమకు నచ్చిన గేదెను ఎక్కడి నుండైనా కొనుగోలు చేయవచ్చనన్నారు.