Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుడిసెల్లోనే జీవనం
- గద్వాల జిల్లా వావిలాలలోని దళితుల దుస్థితి ఇది
ఆ దళిత గుడిసెవాసుల బతుకులు కడు దయనీయం. ఏడాదల్లా ఎండకెండుతూ...వానకు తడుస్తూ...చలికి వణుకుతూ...ఒక్కో ఇంట్లో ఐదారుగురికిపైగా తలదాచుకుంటూ బతుకుతున్న తీరు దుర్భరం. పొద్దస్తమానం రెక్కలరగంగ పనిజేసొస్తే..కంటికి కునుకుండదు. వానొస్తే ఆ గుడిసెలు జల్లెడ తూట్లలా కురుస్తాయి. ఆ రోజంతా పిల్లలతో జాగారమే. గాలొస్తే పైకప్పు ఎప్పుడెగిరిపోతుందో తెలియదు. ఇదీ జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వావిలాల గ్రామ దళితుల పరిస్థితి.
నవతెలంగాణ-మహబూబ్నగర్ప్రతినిధి
వావిలాల గ్రామం హైదరాబాద్ నుంచి కర్నూల్ వెళ్లే జాతీయ రహదారికి 12 కిలోమీటర్ల దూరం లోపల ఉంటుంది. జనాభా 2,450. 200 దళిత కుటుంబాలున్నాయి. వారంతా తాటాకు, జమ్ము గుడిసెల్లోనే జీవిస్తున్నారు. వీరికి వ్యవసాయం, ఆస్తిపాస్తులుగాని లేవు. అంతా కూలీలే. అందరివీ గుడిసెలే. వానొస్తే కురుస్తాయి. దీంతో ఆ కుటుంబాల వారంతా ఆ రోజు జాగారం చేయాల్సిందే. 'మా తాతల కాలం సంది నుంచి భూమి లేదు. జీతముండి బతుకుతున్న. గీ కవరు కప్పిన గుడిసెలోనే ఎండకెండుతూ...చలికి వణుకుతూ...వానకు తడుస్తూ బతుకుతున్నం. వానొచ్చినప్పుడు ఎవ్వరింట్లకు పోదామన్నా..రానివ్వడం లేదు' అని ఈదన్న ఆవేదన వ్యక్తం చేశాడు. కొంతమంది ఊరి బయట ఉన్న పాఠశాల, గ్రామ పంచాయతీ భవనాల్లో తలదాచుకుంటున్నారు. ఈ ఊరికి డబుల్బెడ్రూమ్ ఇండ్లు కాదుకదా..సింగిల్ బెడ్రూమ్లైనా లేనటువంటి పరిస్థితి. దళితులకు మూడెకరాల ఊసే లేదు. 'రెండు రెక్కలు తప్ప మాకు ఆస్తిపాస్తులు లేవు. పొద్ద స్తమానం బయట పనిచేయాలి. మేం చేసే కష్టం మా ముగ్గురు పిల్లల తిండికి గిట్ల సరిపోతలేదు. వానొచ్చినా..గాలొచ్చినా ఈ గుడిసెలోనే జాగారం చేయాలి. నాలుగురోజుల నుంచి ఇదే పరిస్థితి' అని గ్రామానికి చెందిన యాకూబ్ కంటతడి పెట్టుకున్నాడు.
3లక్షలకు పైగా గుడిసెల్లోనే...
సమగ్ర సర్వే రిపోర్టు ప్రకారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో గుడిసెల్లో కాలం వెళ్లదీస్తున్నవారు 3.50 లక్షల మంది. నల్లమలలోని చెంచుపెంటలతో పాటు గద్వాల, గట్టు, అయిజ, కేటిదొడ్డి, నారాయణపేట,కొడంగల్ ప్రాంతాల్లో గుడిసెవాసులు అధికం. గతంలో సర్కారు ఇండ్లతో దళారులు, ఆయా పార్టీల నాయకుల అనుచరులు లాభపడ్డారు తప్ప పేదలకు ఒరిగిందేమీ లేదు. 'మొన్నచ్చిన గాలికి గుడిసె పైకప్పు లేచిపోయింది. ముసుర్ల తడుసుకుంట నా భార్య, ఆరుగురు బిడ్డలు(ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు మగ పిల్లలు)చలికి వణుకుంట బతుకుతున్నం. నిద్రకూడా పడ్తలేదు. నా చిన్నప్పటి నుంచి ఇండ్లిస్తరని వింటున్న. ఇంతవరకు ఒక్క ఇల్లయినా కట్టివ్వ లేదు' అని గ్రామానికి చెందిన జయరాజ్ వాపోయాడు. ఒక్క జయరాజే కాదు ప్రసాద్, దానయ్య, రాజు, సోమన్న, సుం కులమ్మ, మరియమ్మ, శేఖర్, దేవసాయమ్మ, భాగ్యమ్మ, ఆదోని, ఇలా అనేక మంది గుడిసెల్లోనే బతుకులీడుస్తున్నారు. వారి పరిస్థితి అత్యంత దయనీయం.
అర్హులందరికీ ఇండ్లు నిర్మించిస్తాం..: హౌసింగ్ డీిఎం, గద్వాల
జిల్లాలో చాలామంది పేదలున్నారు. వారికి ఇండ్లు లేనిమాట నిజమే. అంచెల ంచెలుగా వారికి రెండుపడకల ఇండ్లు కట్టిస్తాం. కట్టిస్తందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ నిర్మాణ వ్యయం పెరగటంతో కాంట్రాక్టలెవరూ ముందుకు రావట్లేదు.