Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్కు భట్టి విక్రమార్క ప్రశ్న
- ప్రాణహిత ప్రాజెక్టులపై చర్చిద్దాం...రండి?
- కేటీఆర్ స్థాయి మరచి మాట్లాడుతున్నారని ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో -హైదరాబాద్
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సాగునీటి ప్రాజెక్టు పేరు మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు అని పేరెందుకు పెట్టారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. కొత్త డిజైన్లు రూపొందించాలన్నా...పాత డిజైన్లో మార్పులు చేయాలన్నా...అందుకు ఇంజినీర్ల వ్యవస్థ ఉంటుందని, మీకేం క్యాలిఫికేషన్ ఉందని లక్షకోట్లకు ప్రాజెక్టు రీడిజైన్ చేశారని నిలదీశారు. డిజైన్లపై అవగాహన లేకుండా కేసీఆర్ మాట్లాడుతున్నారని, ప్రాణహిత, ఇందిరా, రాజీవ్సాగర్ ప్రాజెక్టులపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. గురువారం గాంధీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. వాస్తవాలను తప్పుదోవపట్టించేలా మంత్రి కేటీఆర్ కాంగ్రెస్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. ప్రాణహిత ప్రాజెక్టు రూ 38వేల కోట్లతో పూర్తయ్యేలా కాంగ్రెస్ డిజైన్ చేస్తే...రీడిజైన్ పేరుతో లక్షకోట్లకు ఎందుకు పెంచారో చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి, కేటీఆర్, హరీశ్రావులలో ఎవరో ఒకరు చర్చకు రావాలని డిమాండ్ చేశారు. నిధులు, నీళ్లు, నియామకాల ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఇవేవీ నెరవేర్చలేదన్నారు. రూ 38 వేలకోట్లతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టి అప్పటికే పదివేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. మరో రూ 28 వేలకోట్లు ఖర్చుచేస్తే ప్రాజెక్టు పూర్తి అయ్యేదన్నారు. రీడిజైన్ పేరుతో ఆ ప్రాజెక్టు అంచనాను లక్ష కోట్లకు పెంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని విమర్శించారు. అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ళ ప్రాజెక్టు పేరును మార్చలేదని మంత్రి హరీశ్రావు చెబుతున్నారని, మరి కాళేేశ్వరం ప్రాజెక్టు అని ఎందుకు పిలుస్తున్నారని నిలదీశారు. కొత్త ప్రాజెక్టు కాదని పాత ప్రాజెక్టు అని కేంద్రానికి ఎందుకు నివేదిక ఇచ్చారని నిలదీశారు. కాళేశ్వరం కొత్త ప్రాజెక్టు అయితే, అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ఏమైందని ప్రశ్నించారు. దుమ్ము గూడెం రాజీవ్ సాగర్, దుమ్ము గూడెం ఇందిరా సాగర్ ప్రాజెక్టులు కేవలం రూ 1421 కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యేవని గుర్తు చేశారు. అగ్రిమెంట్ ప్రకారం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాల్సిన బాధ్యత కాంట్రాక్టరుదేనన్నారు. ఈ రెండు ప్రాజెక్టుల పేరు మార్చి రూ 12 వేల కోట్లమేర అంచనా వ్యయాన్ని పెంచిందన్నారు. కొత్త, పాత ప్రాజెక్టులకు తేడా తెలియకుండా మంత్రి తుమ్మల మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ నేతలు లుచ్చాగాళ్ళు అంటూ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారని, ఇలా మాట్లాడి ప్రాజెక్టుల సమస్యలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మంత్రి కేటీఆర్ తన స్థాయిని తానే దగజార్చుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. ఇలాంటి భాషను పేపర్లో చదివినందుకు సిగ్గుపడుతున్నట్టు ఆయన చెప్పారు.