Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంజినీర్లు కలెక్టర్లకు మంత్రి హరీశ్రావు ఆదేశం
- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపధ్యంలో ఇంజినీర్లు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. వర్షాలు, వరదల పరిస్థితిపై మంత్రి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతుందని అన్నారు. జూనియర్ ఇంజినీర్లు ప్రాజెక్టుల వద్ద ఉండి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని, సాగునీటి శాఖ కేంద్ర కార్యాలయంలోని కంట్రోల్ రూంకు, జిల్లా కలెక్టర్లకు సమాచారం అందించాలని కోరారు. ఎగ్జికూటివ్ ఇంజినీర్లు, చీఫ్ ఇంజినీర్లు కూడా అందుబాటులో ఉండి వరద పరిస్థితిని సమీక్షించాలన్నారు. కడెం ప్రాజెక్టు నుంచి 2 లక్షల క్యూసెక్కులు, ఎల్లంపల్లి నుంచి మూడు లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నామని ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధరరావు తెలిపారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్, ఇంజినీర్లతో మంత్రి మాట్లాడుతూ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద యంత్రాలను, సిబ్బందిని తరలించాలని, ఒక్కరు కూడా అక్కడ ఉండకుండా చూడాలని ఆదేశించారు. స్థానిక అధికారులను వెంటనే అప్రమతం చేయాలన్నారు. ఆదిలబాద్ జిల్లా సాత్నాల ప్రాజెక్టు నుంచి నీరువదులుతున్నామని జిల్లా కలెక్టర్ చెప్పారు. నీరు వదిలే సమయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని మంత్రి చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో చెరువుల పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. వీటి పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం పంపించాలన్నారు. చెరువు కట్టలు తెగే పరిస్థితి ఉంటే వెంటనే సమీప గ్రామాల వారిని, స్థానిక అధికారులను అప్రమత్తం చేయాలన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 38 సెంటీమీటర్లు వర్షం కురిసినా ఒక్క చెరువు కట్ట కూడా తెగిపోలేదంటే ఇది మిషన్ కాకతీయ ప్రభావమని మంత్రి అభివర్ణించారు. జిల్లాలోని గడ్డెన్నవాగు మధ్యతరహా ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయిందని కలెక్టర్ మంత్రి దృష్టికి తెచ్చారు. స్వర్ణ ప్రాజెక్టు నుంచి 14 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్టు ఆయన చెప్పారు.