Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమ్మడి ఆదిలాబాద్లో కుండపోత
- తర్నం వద్ద తెగిన అంతర్రాష్ట్ర వంతెన
- వాగులో చిక్కుకున్న ఉపాధ్యాయులను కాపాడిన ఫైర్ సిబ్బంది
- గర్భిణీని మంచంతో వంతెన దాటించిన గ్రామస్తులు
- చిమ్మచీకట్లో గిరిజన గ్రామాలు
- ఆదిలాబాద్ జిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు
నవతెలంగాణ - విలేకరులు
రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి ఎడతెరపిలేని వర్షం కురుస్తోంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో భారీ వర్షాలు కురవగా, మిగతా ప్రాంతాల్లో చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షం పడుతోంది. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో వరదలకు వంతెనలు తెగిపోయాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ప్రాజెక్టులకు వరద ప్రవాహం పెరిగింది. కరెంట్ సరఫరా స్తంభించి గిరిజన గ్రామాలు చీకట్లో ఉన్నాయి. గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఇండ్లు కూలిపోయాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. భారీ గ్రామాలను వరద ముంచెత్తింది. కుమురంభీం జిల్లా దహెగాం మండలం గిరివెల్లి గ్రామానికి చెందిన గర్భిణి ఎల్కరి సుజాతకు పురిటినొప్పులు రావడంతో మంచెంపై తాళ్లతో కట్టి సుమారు 50మంది యువకులు ఎర్రవాగు దాటించారు. నిర్మల్ జిల్లా భైంసా సుద్దవాగులో చిక్కుకున్న కత్గాం గ్రామ పశువుల కాపరులను ఆర్డీఓ రాజు, డీఎస్పీ అందెరాములు ఆధ్వర్యంలో సహాయక సిబ్బంది ఒడ్డుకు చేర్చారు. మావల మండలం వాఘాపూర్ పాఠశాలకు కారులో వెళ్తున్న ఐదుగురు ఉపాధ్యాయులు రమేష్, ప్రవీణ్, ప్రతాప్, చంద్రశేఖర్, సుజాత వైజాపూర్ వాగులో చిక్కుకున్నారు. కారు కొట్టుకుపోతుండటంతో వారు అందులో నుంచి బయటపడి చెట్టును పట్టుకుని ఉండిపోయారు. విషయం తెలుసుకున్న మంత్రి జోగు రామన్న వెంటనే ఫైర్సిబ్బందిని రప్పించి ఉపాధ్యాయులను కాపాడారు. ఇచ్చోడ పీహెచ్సీలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో భవనంలో చిక్కుకున్న రోగులను అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం తర్నం వద్ద మహారాష్ట్రను కలిపే వంతెన తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. తలమడుగు మండలం రాంనగర్ వద్ద మావల వాగు, బంగారుగూడ, అనుకుంట, రాంపూర్, బట్టిసావర్గాం, భీంసరి, బెల్లూరి, లాండసాంగ్వి వద్ద వాగులు ఉప్పొంగుతున్నాయి. బట్టిసావర్గాం వాగులో కారు కొట్టుకుపోయింది. భీంపూర్ మండలం నిపాని, సంటర్సాంగ్వి వాగులు ఉధృతంగా ప్రవహించడంతో 30 గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయాయి. తలమడుగు మండలంలోని కప్పర్దేవి బ్రిడ్జి కూలింది. కొమురంభీం జిల్లాలోని ఎర్రవాగు, చిక్లీవాగు, పెద్దవాగు, చెలిమెల వాగు గతంలో ఎన్నడూ లేని విధంగా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కుమురం భీం ప్రాజెక్టు కాలువకు గండి పడి కాగజ్నగర్ మండలంలోని కోసిని పంచాయతీ పరిధిలోని రాంనగర్ నీట మునిగింది. డాడానగర్లో 60ఎకరాల వరిపంట నీటమునిగింది. కోసిని, డాడానగర్, బెజ్జూర్, పెంచికల్ఫేట గ్రామాల్లో సుమారు 50ఇండ్లలోకి నీరు చేరింది. బెజ్జూరు, కౌటాల, పెంచికల్పేట, చింతమానెపల్లిల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని అప్రోచ్ వంతెన తెగింది. వాగు ప్రవాహం పెరిగి 13 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోటపల్లి మండలంలోని అన్నారం, రాచర్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నెన్నెల మండలంలోని చిత్తాపూర్ చెరువు అలుగెల్లి పొలాలు నీట మునిగాయి.
జగిత్యాల జిల్లాలో వర్షానికి కోరుట్ల పట్టణంలోని శివారుకాలనీలు జలమయమయ్యాయి. మెట్పల్లి పట్టణ శివారులోని వట్టివాగు వంతెన వద్ద లోవేల్ కల్వర్టు వరదకు కొట్టుకుపోయింది. వట్టివాగు వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ పరిధిలోని 23వ డివిజన్లోని జ్యోతినగర్లో కుక్క నర్సయ్య ఇల్లు కూలిపోయింది. పెద్దపల్లి మండలంలోని చందపల్మిలకు వెళ్లేదారిలోని గుండంకట్ట చెరువు నిండి రోడ్డు మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని ఎల్లమ్మ చెరువు, గుండమ్మ చెరువు పూర్తిగా నిండిపోవడంతో చందపల్లి వెళ్లే దారివైపు గండి పడింది. కమాన్పూర్లో శాలపల్లి రోడ్డుపైనున్న కల్వర్టు తెగి రాకపోకలు నిలిచిపోయాయి. వీర్నపల్లి లోతు వాగు ఉధృతంగా ప్రవహించడంతో అంబేద్కనగర్ గ్రామంతో సంబంధాలు తెగిపోయాయి.
ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత
జూరాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. 6 యూనిట్లలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రాత్రి 7గంటలకు 33 గేట్లు 2మీటర్ల మేర ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 699.5 అడుగులకు చేరింది. 13 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టు 3గేట్లను ఎత్తి 20వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేసి 2వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జైనథ్ మండలం సాత్నాల ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదిలిపెట్టారు. తాంసి మండలం వడ్డాడిలోని మత్తడివాగు నాలుగు గేట్లను ఎత్తేశారు. కుమురం భీం అడ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరింది. ప్రాజెక్టు నీటిమట్టం 243మీటర్లుకాగా, ప్రస్తుతం 241.955మీటర్లు ఉంది. ఇన్ఫ్లో 95,000 క్యూసెకులుకాగా ఎనిమిది గేట్లు ఎత్తి 94,000 క్యూసెక్లు నీటిని బయటకు వదులుతున్నారు. భద్రాద్రి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.
ప్రాజెక్టుల్లో నీటి సమాచారం
ప్రాజెక్టు పేరు సామర్థ్యం ప్రస్తుతం ఇన్ఫ్లో అవుట్ ఫ్లో
(టీఎంసీల్లో) (టీఎంసీల్లో) (క్యూసెక్కుల్లో) (క్యూసెక్కుల్లో)
ఆల్మట్టి 129.72 126.38 1,03,3093 1,19,563
నారాయణపూర్ 37.64 36.15 1,21,152 1,27,765
జూరాల 9.66 9.62 1,67,845 1,99,766
శ్రీశైలం 215.81 156.76 1,19,476 54,491
నాగార్జునసాగర్ 312.05 157.99 33,890 5,687
సింగూరు 29.91 7.35 000 000
నిజాంసాగర్ 17.80 2.24 000 000
శ్రీరాంసాగర్ 90.31 17.74 16,836 258
లోయర్ మానేరు 24.07 3.42 238 99
శ్రీపాద ఎల్లంపల్లి 20.18 19.07 2,90,000 3,00,000
కడెం 7.60 7.19 1,90,000 2,00,000