Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరుగురు మంత్రులకు టిక్కెట్లు డౌటే
- 40 మంది సిట్టింగ్ల మార్పు
- ఎమ్మెల్సీ, నామినేటెడ్, రాజ్యసభ పదవులు ఇస్తామని భరోసా
- పార్టీకి సహకరించాలని కోరనున్న గులాబీబాస్
- నేటి రాష్ట్ర కమిటీ సమావేశం వాయిదా
- జిల్లాలవారీ సమావేశాల తర్వాతే....
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
టీఆర్ఎస్లో టిక్కెట్ల లొల్లి షురూ అయ్యింది. శుక్రవారం జరగాల్సిన ఆపార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం వాయిదా పడటంతో ఎమ్మెల్యేల్లో మరింత టెన్షన్ పెరిగింది. టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వద్ద ఉన్న జాబితాలో తమ పేరు ఉందో లేదో అనే సందేహం ఎమ్మెల్యేలను వెంటాడుతోంది. దీంతో ఎక్కడైనా లీకులు దొరుకుతాయేమో అని కొందరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వ్యవహారాలు చూసే పత్రికా విలేకరులను వాకబు చేస్తున్నారు. దానికోసం చిట్చాట్ల పేరుతో విలేకరుల్ని విందులకు అహ్వానిస్తున్నారు. ఒకవేళ మళ్లీ టిక్కెట్ రాకుంటే ఏం చేయాలో కూడా సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారు. స్థానికంగా ప్రతిపక్ష రాజకీయపార్టీలపై విమర్శల జోరునూ తగ్గించారు. రాష్ట్రకమిటీ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు త్యాగాలకు సిద్ధంకావాలని సీఎం కోరతారనే ప్రచారం జరుగుతోంది. కచ్చితంగా 40 మంది సిట్టింగులపై వేటు వేస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వారిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ నుంచి విడతల వారీ ప్రకటించే అభ్యర్ధుల జాబితాల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేసుకొనే అవకాశాలూ ఉన్నట్టు సీఎం కేసీఆర్ వ్యవహారశైలి తెలిసిన నాయకులు భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పేర్లు ఆ జాబితాలో ఉండేలా చూడాలని సీఎం కేసీఆర్ కుటుంబసభ్యుల చుట్టూ తిరుగుతున్నారు. మంత్రి హరీశ్రావుకు నమ్మకస్తులుగా ఉన్నవారిపై తొలి వేటు పడే అవకాశాలు ఉన్నట్టు పార్టీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమౌతోంది. ఆయా స్థానాల్లో సీఎం కుమారుడు, మంత్రి కేటీఆర్కు నమ్మకస్తులుగా ఉన్నవారి పేర్లు చేర్చేలా జాబితా సిద్ధమౌతున్నదనే వాదనా లేకపోలేదు. మెజారిటీ ఎమ్మెల్యేలు తమ లాబీయింగ్ను మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, లోక్సభ సభ్యురాలు కవిత, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ల ద్వారా చేస్తున్నారు. కొందరు సీనియర్ మంత్రులకు కూడా ఉద్వాసన చెప్తారనే ప్రచారం జరుగుతోంది. ఆ జాబితాలో తొలి పేరు నాయిని నర్సింహారెడ్డిది ఉన్నట్టు తెలుస్తోంది. మరోమంత్రి కడియం శ్రీహరికి కూడా కష్టకాలమే ఉన్నట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అలాగే ఆర్ధికశాఖ మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గం మారుతుందని, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి రాజయ్యల పేర్లు తొలి జాబితాలో ఉండకపోవచ్చంటూ టీఆర్ఎస్భవన్లో చెప్పుకుంటున్నారు..
ఎమ్మెల్యే అభ్యర్ధుల తాజా జాబితాలో మంత్రి కేటీఆర్ మార్కు తప్పనిసరిగా ఉంటుందనే బలమైన వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ప్రస్తుతానికి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు వాయిదా పడ్డాయి. అయితే తిరిగి ఈ సమావేశాలు నిర్వహించడానికంటే ముందు జిల్లాలవారీగా ఓ రౌండ్ ఎమ్మెల్యేలతో భేటీ అయితే ఎలా ఉంటుందనే ఆలోచన సీఎం కేసీఆర్ మదిలో మెదిలినట్టు తెలుస్తోంది. ఈ సలహా కూడా మంత్రి కేటీఆర్ నుంచే వచ్చిందని పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్నది.
ఇదీ లెక్క....
2014 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాల్లో పోటీచేసి, టీఆర్ఎస్పార్టీ 63 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్-21, తెలుగుదేశంపార్టీ-15, మజ్లిస్-7, బీజేపీ-5, సీపీఐ-1, సీపీఎం-1, బీఎస్పీ-2, వైఎస్ఆర్ కాంగ్రెస్-3, ఇండిపెండెంట్-1 స్థానంలో విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్పార్టీ ఆ తర్వాత టీడీపీ నుంచి 12 మంది, బీఎస్పీ నుంచి ఇద్దరు, సీపీఐ నుంచి ఒక్కరు, కాంగ్రెస్ నుంచి నలుగురితో పాటు ఇండిపెండెంట్గా ఉన్న ఒక్క ఎమ్మెల్యేను కూడా తమపార్టీలో చేర్చుకుంది. దీంతో అసెంబ్లీలో టీఆర్ఎస్ సంఖ్యాబలం 86కి పెరిగింది. అయితే సాంకేతికంగా టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన రేవంత్రెడ్డితో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు వారివారి సొంతపార్టీల్లో ఉన్నట్టే అసెంబ్లీ రికార్డులు చెప్తున్నాయి. ఏడు సర్వేలు చేయించిన సీఎం కేసీఆర్ వలస వచ్చిన ఎమ్మెల్యేలతో సహా మొత్తంగా వంద సీట్లు గెలుస్తామని ధీమాగా చెప్తున్నారు. అయితే సర్వే ఫలితాలు ఇందుకు భిన్నంగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే కనీసం 40 మంది సిట్టింగులను మారిస్తే తప్ప, ఆశించిన ఫలితాలు రావని గులాబీబాస్ అంచనా .