Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వార్డెన్, విద్యార్థినికి స్వల్ప గాయాలు
నవతెలంగాణ - గజ్వేల్
సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని బాలికల ఎడ్యుకేషన్ హబ్ కస్తూర్బా పాఠశాలలో గురువారం అగ్నిప్రమాదం సంభవిం చింది. ఈ ఘటనలో వార్డెన్, విద్యార్థినికి స్వల్ప గాయాలు అయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. గజ్వేల్లోని కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులు తెల్లవారుజాము 4 గంటల సమయంలో నిద్రించే గదిలో నుంచి చదువుకునేందుకు స్టడీ హాల్కు వెళ్లారు. 4:30 గంటల సమయంలో నిద్రించే గదిలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా పొగలు వ్యాపించడంతో, స్టడీ హాల్ నుంచి విద్యార్థులు పరుగులు తీశారు. మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తుండగా వార్డెన్ వెంకటలక్ష్మి, మరో విద్యార్థినికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. వారు సకాలంలో స్పందించకపోవడంతో గదిలోని వస్తువులన్నీ పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఆ సమయంలో విద్యార్థులు గదిలో లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పింది. కేజీబీవీలో ఎక్కడా ఫైర్ ఎక్స్టిన్గ్యుషర్లు లేకపోవడం గమనార్హం. విషయం తెలుసుకున్న డీఈఓ రమాకాంత్రావు, గడ అధికారి ముత్యంరెడ్డి, ఎంఈఓ సునీత, తహసీల్దార్ బాల్రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ గాడిపల్లి భాస్కర్ సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అధికారులు మాట్లాడుతూ విద్యార్థులు భయాందోళనలకు గురి కావొద్దని, తగిన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. అనంతరం పుస్తకాలు, దుస్తులు కాలిపోవడంతో మున్సిపల్ చైర్మెన్ భాస్కర్ విద్యార్థులందరికీ పుస్తకాలు, దుస్తులు అందజేశారు. సీపీఐ(ఎం), సీపీఐ, బీజేపీ నాయకులు సందర్శించి విద్యార్థులను పరామర్శించారు. ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులతో మాట్లాడి మనోధైర్యం కల్పించారు.