Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని పార్టీలు మ్యానిఫెస్టోల్లో పెట్టాలి : టీమాస్ రాష్ట్ర చైర్మెన్ కంచ ఐలయ్య
- యూనివర్సిటీల్లో నిరసన ర్యాలీలకు పిలుపు
- 25న మండలాల్లో ధర్నాలు: జాన్వెస్లీ
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
రాష్ట్రంలో పెరుగుతున్న కులదురహంకార హత్యలను అడ్డుకట్టవేసేందుకు కులాంతర వివాహాల చట్టం తీసుకురావాలని టీమాస్ రాష్ట్ర చైర్మెన్ కంచ ఐలయ్య డిమాండ్ చేశారు. కుల దురహంకారానికి బలైన ప్రణరు భార్య అమృత పేరుతో ఈ చట్టాన్ని తీసుకురావాలని ఆయన కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ హత్యలను నిరసిస్తూ అన్ని యూనివర్సిటీల్లో విద్యార్థులు ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీమాస్ రాష్ట్ర కన్వీనర్ జాన్వెస్లీ, ఇతర నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో కులాంతర వివాహాలు చేసుకున్న వారిని భయంకరంగా చంపుతున్నారని అన్నారు. హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల కంటే ఎక్కువ హత్యలు తెలంగాణలో జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగున్నర ఏండ్ల కాలంలో జరిగిన కులదురహంకార హత్యలను సీఎం కేసీఆర్ ఖండించలేదని, అంటే ఇలాంటి హత్యలను ప్రభుత్వం అంగీకరిస్తుందా..? అని ప్రశ్నించారు. అమృత తండ్రి టీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తిగా చెబుతున్నారనీ, ఆయన్ను ఇప్పటికీ ఆ పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని విమర్శించారు. కులాంతర వివాహాలను చేసుకున్న వారిని చంపడాన్ని వ్యతిరేకిస్తూ, దీనిపై పోరాడతానని అమృత ప్రకటించడం అభినందనీయమని చెప్పారు. సీపీఐ(ఎం), బీఎల్ఎఫ్ మినహా ఏ పార్టీ కూడా కుల దురహంకార హత్యలపై స్పందించలేదన్నారు. కాంగ్రెస్ నేత జానారెడ్డి అక్కడికి వెళ్లొచ్చినా పార్టీ వైఖరిపై స్పష్టత ఇవ్వలేదని అన్నారు. బుధవారం హైదరాబాద్లో తండ్రి దాడిలో మాధవి చావుతో పోరాడుతుందని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మ్యానిఫెస్టోల్లో కులాంతర వివాహాల చట్టం అంశాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు. టీమాస్ రాష్ట్ర కన్వీనర్ జాన్వెస్లీ మాట్లాడుతూ...రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై సీఎం, హోంమంత్రి, డీజీపీ స్పందించకపోవడం శోచనీయమన్నారు. స్వాతి, నరేశ్, మధుకర్లను హత్య చేసిన వారికి ఇప్పటికీ శిక్షపడలేదని చెప్పారు.
కుల దురహంకార హత్యాఘటనల్లో విచారణకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి, మూడు నెలల్లో నిందితులకు శిక్షలు వేయాలని డిమాండ్ చేశారు. హత్యలకు కారణమైన నిందితులకు పోలీసులు వంతపాడుతున్నారనీ, కులాంతర వివాహాలు చేసుకున్న వారిని బెదిరిస్తున్నారని విమర్శించారు. ఈ హత్యలకు నిరసనగా ఈనెల 25న అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సమావేశంలో టీమాస్ నేతలు హిమబిందు, కిల్లె గోపాల్, మన్నారం నాగరాజు, ఆశయ్య, శ్రీరాంనాయక్, ధర్మానాయక్ తదితరులు పాల్గొన్నారు.