Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగం, భూమి, డబుల్బెడ్రూమ్ ఇల్లిస్తాం :
ప్రణయ్ కుటుంబానికి మంత్రి జగదీశ్రెడ్డి పరామర్శ
- రూ.4.12 లక్షల చెక్కు అందజేత
నవతెలంగాణ- మిర్యాలగూడ
ప్రణయ్ హత్య గురించి సమాజం మర్చిపోకముందే విచారణ పూర్తి చేసి నిందితులను శిక్షించాలని ఆపద్ధర్మ మంత్రి గుంతకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ప్రణయ్ కుటుంబ సభ్యులను ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్రావు, గాదరి కిశోర్, నాయకులు నోముల నర్సింహయ్య, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ రంగనాధ్తో కలిసి వెళ్లి పరామర్శించారు. ప్రణరు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ తరపున మంజూరైన రూ.4.12 లక్షల చెక్కును కుటుంబీకులకు అందజేశారు. అమృతకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు, డబుల్బెడ్రూమ్ ఇల్లు, నాలుగెకరాల వ్యవసాయ భూమి అందిస్తామన్నారు. ప్రణరు హత్య దురదృష్టకరమన్నారు. ఈ కేసును త్వరగా చేధించినందుకు పోలీసులను అభినందించారు. ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్గా తీసుకుందని, అమృత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. బాలస్వామి కుటుంబానికి రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వీరి వెంట ఆర్డీఓ జగన్నాధరావు, డీఎస్పీ శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు తిరునగరు భార్గవ్ ఉన్నారు.
ఉత్తమ్ పద్మావతి పరామర్శ
ప్రణరు కుటుంబాన్ని కోదాడ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి పరామర్శించారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రణరు చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ప్రణరు హత్య చాలా బాధాకరమని, పార్టీలకతీతంగా ఇలాంటి ఘటనలను ఖండించాలని అన్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని, కులమతాలను చిన్నచూపు చూడటం సరైంది కాదని అన్నారు. ఆమె వెంట దామరచర్ల జెడ్పీటీసీ శంకర్నాయక్, మాల మహానాడు జాతీయ నాయకులు తాళ్లపల్లి రవి, అమృతయ్య ఉన్నారు.
బాధ్యులకు శిక్ష పడేలా పోరాడుతాం..: శంకర్ లుకా
ప్రణరు హత్యకు కారకులైన బాధ్యులకు శిక్ష పడేలా పోరాడుతామని మైనార్టీ కమిషన్ వైస్ చైర్మన్ శంకర్ లుకా అన్నారు. ప్రణరు చిత్రపటానికి ఆయన పూలమాలలేసి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అమృత కుటుంబానికి అండగా ఉండి న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. అదే విధంగా మానవ హక్కులు-నేర నిరోధక సంఘం జాతీయ చైర్మన్ బోడ రమేశ్నాయక్ ప్రణరు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
జమాయత్-ఉలేమా-ఏ-హింద్ ఆధ్వర్యంలో...
జమాయత్-ఉలేమా-ఏ-హింద్ ఆధ్వర్యంలో ప్రణరు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రణరు మృతి తల్లిదండ్రులు, అమృతకు తీరని లోటని ఆ సంఘం అధ్యక్షులు మౌలానా వలీఉల్లా అన్నారు. హత్యకు కారణమైన ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.ప్రజాబంధు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓసీర్ ప్రణరు కుటుంబాన్ని పరామర్శించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.