Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్యాల / కొడిమ్యాల
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొట్టగట్టుపైకి నాలుగు ఉచిత సర్వీసు మినీ బస్సులను కలెక్టర్ శరత్, ఎస్పీ సింధూశర్మ ప్రారంభించారు. ఈ బస్సులు ప్రతిరోజూ ఉదయం 11 ట్రిప్పులు నడుస్తాయని, శని, మంగళవారాల్లో నాలుగు బస్సులూ నడుపుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. కొండగట్టు ఘాట్రోడ్డులో ప్రమాదాల దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సు సర్వీసులను ప్రారంభించినట్టు తెలిపారు. లైట్ మోటార్ వాహనాలను మాత్రమే ప్రస్తుతానికి ఘాట్ రోడ్డుపైకి అనుమతిస్తున్నామని చెప్పారు. మలుపులు, కల్వర్టులు, స్పీడ్ బ్రేకర్లు ఉన్న ప్రతి చోటా ప్రమాద సూచిక బోర్డులు అమర్చామని తెలిపారు. ఘాట్ రోడ్డు ప్రమాద స్థలాన్ని ఆనుకుని ఇరువైపులా సిమెంట్ దిమ్మెలు నిర్మిస్తున్నట్టు చెప్పారు. ప్రమాదానికి కారణమైన గోతిని పూడ్చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. అనంతరం కలెక్టర్ను హిమ్మత్రావుపేట వాసులు కలిశారు. ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన బాధితులకు కనీసం మందులు కూడా ఇవ్వడం లేదని ఆ గ్రామానికి చెందిన కృష్ణారావు తెలపగా, కలెక్టర్ వెంటనే ఆర్ఎమ్తో మాట్లాడి ఇప్పించేందుకు హామీ ఇచ్చారు.
కొండగట్టు బాధితుల్లో మరో మహిళ మృతి
61కి చేరిన మృతుల సంఖ్య
కొండగట్టు ఘాట్రోడ్డుపై ఈనెల 11న జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో గాయపడిన చికిత్స పొందుతున్న మరో మహిళ పరిస్థితి విషమించి గురువారం మరణించింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 61కి చేరింది. కొండగట్టు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొడిమ్యాల మండలం హిమ్మత్రావుపేటకు చెందిన బీరం రాణి(40)ని మెరుగైన వైద్యం కోసం అదే రోజు హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. తొమ్మిది రోజుల తర్వాత ఆమె చనిపోయింది.