Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫీజుల సవరణ జరిగేనా?
- టీఏఎఫ్ఆర్సీ చైర్మెన్ పోస్టు ఖాళీ
- రెండు నెలలవుతున్నా నియమించని సర్కారు
- ఇంకా ప్రారంభం కాని కసరత్తు
- 2019-20 నుంచి అమల్లోకి రానున్న కొత్త ఫీజులు
- హడావుడి నిర్ణయాలతో విద్యార్థులకు నష్టం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) చైర్మెన్ పోస్టు ప్రస్తుతం ఖాళీగా ఉన్నది. రెండు నెలలుగా టీఏఎఫ్ఆర్సీ చైర్మెన్ పోస్టు ఖాళీగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నియమించలేదు. 2019-20 విద్యాసంవత్సరం నుంచి వృత్తి విద్యా కోర్సులు, మెడికల్ కాలేజీల్లో ఫీజులు సవరణ జరగాల్సి ఉంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజులను సమీక్షిస్తారు. ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజులు, వ్యయం, జీతాలు, ఇతర ఖర్చుల వివరాలను ఆధారాలతో సహా టీఏఎఫ్ఆర్సీకి కాలేజీ యాజమాన్యాలు సమర్పించాలి. టీఏఎఫ్ఆర్సీ కమిటీ ఫీజులు ఎంత ఉండాలనే దానిని పరిశీలించి ఖరారు చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపిస్తుంది. ఆ తర్వాతే కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయి. ఇప్పటికే టీఏఎఫ్ఆర్సీ 2019-20 విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి రానున్న కొత్త ఫీజుల సవరణకు సంబంధించిన కసరత్తు ప్రారంభించాలి. కానీ టీఏఎఫ్ఆర్సీ కమిటీ లేకపోవడం, చైర్మెన్ పోస్టు ఖాళీగా ఉండడంతో ఫీజుల సవరణ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. టీఏఎఫ్ఆర్సీ నియామకం ఆలస్యం కావడంతో అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నది. సకాలంలో టీఏఎఫ్ఆర్సీ ఫీజుల సవరణ ప్రక్రియను ప్రారంభిస్తే వృత్తి విద్యా కోర్సుల ఫీజులు శాస్త్రీయంగా జరుగుతాయని విద్యావేత్తలు సూచిస్తున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ జరిగే సమయంలో హడావుడిగా ఫీజులను ఖరారు చేస్తే విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తమవుతున్నది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదని తెలుస్తున్నది.
గతంలో ఇప్పటికే కసరత్తు ప్రారంభం
టీఏఎఫ్ఆర్సీ 2015, జులై 22న జీవో నెంబర్ 160 ప్రకారం ఏర్పడింది. టీఏఎఫ్ఆర్సీ చైర్మెన్గా రిటైర్డ్ జడ్జి జస్టిస్ పి స్వరూప్రెడ్డి నియమితులయ్యారు. 11 మందితో టీఏఎఫ్ఆర్సీ కమిటీ ఏర్పడింది. స్వరూప్రెడ్డి పదవీకాలం 2018, జులై 21వ తేదీతో పూర్తయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు నెలల నుంచి టీఏఎఫ్ఆర్సీ చైర్మెన్ పోస్టు ఖాళీగా ఉంది. రాష్ట్రంలో ఇంజినీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, ఫార్మసీ, లా వంటి కోర్సుల ఫీజుల సవరణ అవుతాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదటిసారి ఫీజుల సవరణ ప్రక్రియ 2016-17 విద్యాసంవత్సరంలో జరిగింది. అయితే ఫీజుల ఖరారుకు సంబంధించిన ప్రక్రియ మాత్రం 2015 ఆగస్టు నుంచే ప్రారంభమైంది. 2015, ఆగస్టు 17న టీఏఎఫ్ఆర్సీ చైర్మెన్గా స్వరూప్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఫీజుల సవరణకు సంబంధించి కసరత్తు ప్రారంభించారు. 2015, అక్టోబర్ 20వ తేదీ వరకు కాలేజీల నుంచి ప్రతిపాదనలు స్వీకరించారు. ఆ ఫీజులు 2016-17, 2017-18, 2018-19 విద్యాసంవత్సరాల్లో మూడేండ్లపాటు అమల్లో ఉన్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త ఫీజులు ఖరారు చేయాల్సి ఉంటుంది. ఆ ఫీజులు 2019-20, 2020-21, 2021-22 విద్యాసంత్సరాల్లో మూడేండ్లపాటు కొత్త ఫీజులు అమల్లో ఉంటాయి. కొత్త ఫీజుల ఖరారుకు టీఏఎఫ్ఆర్సీ చైర్మెన్ను నియమించకపోవడం పట్ల అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ఫీజులు పెరిగితే విద్యార్థులపై భారం
ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజులను వచ్చే మూడు విద్యాసంవత్సరాలకు కొనసాగిస్తామని టీఏఎఫ్ఆర్సీ ప్రకటిస్తే కాలేజీ యాజమాన్యాలు అంగీకరించే పరిస్థితి ఉండబోదని తెలుస్తున్నది. అధ్యాపకుల జీతాలు, ఇతర అవసరాలు పెరిగిపోయినందున ఫీజులు పెంచాల్సిందేనని కాలేజీ యాజమాన్యాలు కోరుతున్నాయి. టీఏఎఫ్ఆర్సీ నియామకం తర్వాత హడావుడిగా ఫీజులు ఖరారు చేస్తే వివిధ కోర్సుల ఫీజులు పెరిగే ప్రమాదం లేకపోలేదు. ఫీజులు పెరిగితే విద్యార్థులపైనే భారం పడుతుంది. ఇంకోవైపు ఇంజినీరింగ్ కోర్సుల ఫీజులు మరింత పెరిగే అవకాశమున్నది. ఇప్పటికే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నియమించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఇంజినీరింగ్ ఫీజులు పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఇంజినీరింగ్ ఫీజులను మూడు ప్రాంతాలు (ఎక్స్,వై,జెడ్)గా వర్గీకరించి ఖరారు చేసింది. వార్షిక ఫీజు ఎక్స్ నగరంలో రూ.1.58 లక్షలు, వై నగరంలో రూ.రూ.1.50 లక్షలు, జెడ్ నగరంలో రూ.1.44 లక్షలుగా నిర్ణయించింది. ఈ ఫీజులను అమలు చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. దీంతో తెలంగాణలో 2019-20 విద్యాసంవత్సరం నుంచి శ్రీకృష్ణ కమిటీ సిఫారసులకు అనుగుణంగా కొత్త ఫీజులు అమల్లోకి వచ్చే అవకాశమున్నది. టీఏఎఫ్ఆర్సీ శ్రీకృష్ణ కమిటీ సిఫారసులనూ పరిగణనలోకి తీసుకొని ఫీజులను ఖరారు చేసే సూచనలున్నాయి. కృష్ణ కమిటీ సిఫారసులకు అనుగుణంగా ఇంజినీరింగ్ ఫీజులు పెంచితే విద్యార్థులందరిపైనా భారం పడుతుంది. ప్రస్తుతం ఎంసెట్లో పదివేలలోపు ర్యాంకు సాధించిన విద్యార్థులందరికీ రాష్ట్ర ప్రభుత్వమే ఫీజులు పూర్తిగా చెల్లిస్తున్నది.
రాష్ట్రంలో రూ.35 వేల నుంచి రూ.1,13,500 వరకు ఫీజులున్నాయి. ఎస్సీ,ఎస్టీలకు పూర్తి ఫీజు ప్రభుత్వమే భరిస్తుంది. ఇక బీసీలు, ఓసీలు, మైనార్టీలకు పది వేల ర్యాంకు దాటితే రూ.35 వేల ఫీజు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది. మిగిలిన ఫీజులను విద్యార్థులే చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికైనా టీఏఎఫ్ఆర్సీని వెంటనే నియమిస్తే ఫీజులు శాస్త్రీయంగా సవరణ జరుగుతుందని, విద్యార్థుల ప్రయోజనాలకు అనుగుణంగా ఫీజులు ఖరారు అవుతాయని విద్యావేత్తలు సూచిస్తున్నారు.