Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జ్వరంతో ముగ్గురు.. డెంగ్యూతో ఇద్దరు
నవతెలంగాణ - యంత్రాంగం
విషజ్వరాలతో ఖమ్మం, యాదాద్రి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గురువారం ఐదుగురు మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ధర్మాతండాకు చెందిన బాణోత్ రాజశేఖర్(20) ఖమ్మంలోని ఓ ప్రయివేటు డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవ త్సరం చదువుతున్నాడు. కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతుండడంతో ఓ ప్రయివేటు ఆస్పత్రిలో వైద్యం చేయిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం చనిపోయాడు. రాజశేఖర్ కుటుంబాన్ని మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ పరామర్శించారు.
కూసుమంచికి చెందిన రంజిత్, అరుణ దంపతుల కుమార్తె వేముల కీర్తన(8) నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. దీంతో కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొల్లూరు గ్రామానికి చెందిన కానరాజు ఉష(25) టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతూ పదిరోజులుగా హైదరాబాద్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించింది. మృతురాలికి భర్త సురేష్, ఇద్దరు పిల్లలున్నారు.
డెంగ్యూతో ఇద్దరు చిన్నారులు మృతి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పంచాయతీ వెంకటేశ్వర కాలనీకి చెందిన అబ్దుల్ రహీం(8) డెంగ్యూతో మృతిచెందాడు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న బాలునికి వైద్యం అందిచారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అదే గ్రామానికి చెందిన కానిస్టేబుల్ ఈశ్వర్ కుమార్తె ఏక్ష(6) రెండు రోజులు జ్వరంతో బాధపడుతుండగా స్థానిక ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించి గురువారం మృతి చెందింది.