Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 25 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు
- విగ్రహాలకు జియో ట్యాగ్
- నిమజ్జనానికి 15 లక్షల మంది
- 605 సమస్యాత్మక, 310 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తింపు: సీపీ అంజన్కుమార్
నవతెలంగాణ-సిటీబ్యూరో
శుక్రవారం మొహర్రం, 23వ తేదీ ఆదివారం జరగనున్న గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ చెప్పారు. అదనపు సీపీలు మురళీకృష్ణా, శివప్రసాద్, అనిల్కుమార్, షీఖాగోయేల్తో కలిసి గురువారం ఆయన తమ కార్యాలయంలో మీడియాతో
మాట్లాడారు. మొహర్రం, గణేష్ నిమజ్జనానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. మొత్తం 25వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉంటారన్నారు. సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో 10446 విగ్రహాలు ప్రతిష్టించినట్టు, హైదరాబాద్లో అధికారికంగా 14,500 ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మూడు కమిషనరేట్ల పరిధిలో ఇప్పటికే వేలాది విగ్రహాలను నిమజ్జనం చేశారన్నారు. ట్యాంక్బండ్తో పాటు వివిధ ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుందన్నారు. నిమజ్జనానికి సుమారు 10 నుంచి 15 లక్షల మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. 23వ తేదీ మధ్యాహ్నం వరకు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. మొత్తం 120 కిలోమీటర్ల రహదారి పరిధిలో నిమజ్జనోత్సవం సాగుతుందన్నారు. 2.5 లక్షల సీసీ కెమెరాల ద్వారా నగరంలో వినాయక శోభాయాత్ర, నిమజ్జనం కొనసాగే తీరును కమిషనరేట్లోని కమాండ్ కంట్రోల్ రూంతోపాటు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సబ్కంట్రోల్ కేంద్రాల నుంచి ఎప్పటికప్పుడూ పరిశీలిస్తామని చెప్పారు. ఈసారి గణేష్ విగ్రహాల నిమజ్జనం మరింత వేగంగా పూర్తి చేసేందుకు క్రేన్కు కొత్త పరికరాన్ని అమర్చనున్నట్టు వెల్లడించారు. ప్రతి విగ్రహానికి జియో ట్యాంగింగ్ ఏర్పాటు చేశామన్నారు. దీంతో గంట వ్యవధిలో సుమారు 25 విగ్రహాలు సులభంగా నిమజ్జనం చేయొచ్చని వివరించారు. ప్రత్యేకంగా గజ ఈతగాళ్లను నియమించినట్టు చెప్పారు.
నగరంలో 605 సమస్యాత్మక, 310 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించామన్నారు. నలుగురు అదనపు సీపీలు, జాయింట్ సీపీ, తొమ్మిది మంది డీసీపీలు, 20 మంది అదనపు సీపీలు, 618 మంది ఎస్ఐలు, వందలాది మంది కానిస్టేబుళ్లు, మహిళా పోలీసులు, హోంగార్డులు భద్రతలో ఉంటారన్నారు. అదనంగా ట్రాఫిక్, ఏఆర్, టీఎస్ఎస్పీ, అక్టోపస్, ఆర్ఫీఎఫ్, డాగ్స్వ్కాడ్, బాంబ్ స్వ్కాడ్తో పాటు షీ బృందాలను రంగంలోకి దించుతున్నామన్నారు. మొత్తం 25వేల మంది పోలీస్ సిబ్బందితో భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తామన్నారు. ర్యాలీలో ఇబ్బందులు తలెత్తినా వెంటనే నివారించేందుకు 410 మొబైల్ పార్టీలను ఏర్పాటు చేశామన్నారు.