Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం, హోంమంత్రి ఎందుకు స్పందించడం లేదు..?
- ప్రత్యేక చట్టం కోసం 25న మండల కేంద్రాల్లో నిరసనలు
- 24న ఎస్వీకేలో రాష్ట్ర సదస్సు :సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
నాలుగేండ్ల కాలంలో రాష్ట్రంలో 14 కుల దురహంకార హత్యలు జరిగాయనీ, అయినా ప్రభుత్వ పెద్దలు ఇప్పటికీ స్పందించలేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. సర్కారు అనుసరిస్తున్న తీరుతోనే హత్యలు పెరుగుతున్నాయని తెలిపారు. ఈ హత్యలపై సీఎం
కేసీఆర్, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ప్రధాన బాధ్యులుగా ఉన్న ఆ నలుగురు స్పందించకుంటే ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. సీఎం, మంత్రులు స్పందించకున్నా, ప్రజానీకం స్పందించాలని కోరారు. రాష్ట్రంలో హత్యల పరంపర ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రం అప్రతిష్టపాలవుతుందనీ, అవమానంతో తలదించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలపై పౌర సమాజం, దళిత, ప్రజా సంఘాలు స్పందించి నిరసనలు వ్యక్తం చేయాలని, కులదురహంకార హత్యలను వ్యతిరేకించే వారంతా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
గురువారం ఎంబీభవన్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి వెంకట్, టి జ్యోతి, జాన్వెస్లీతో కలిసి తమ్మినేని విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కులదురహంకార హత్యల పరంపర కొనసాగుతున్నదని అన్నారు. ఇవి యాధృచ్చికంగా జరుగుతున్నవి కావనీ, ప్రభుత్వం కులాలపట్ల అనుసరిస్తున్న తీరు, అగ్రకుల ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న తీరు నరహంతకులకు ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తున్నదని విమర్శించారు. హత్యలపట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న మెతక వైఖరితో హత్యలను ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. కేసీఆర్ దొరతనానికి, కిందికులాల పట్ల ఉన్న చిన్నచూపు, చులకన భావానికి తార్కానమని అన్నారు. ఈనెల 24న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కుల దురహంకార హత్యలను నిరసిస్తూ, ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ, ప్రత్యేక చట్టాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్తో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దీనిలో కుల, ప్రజాసంఘాలను, మానవ హక్కుల సంఘాలను భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా యువతీ, యువకులను సమీకరించి ఈనెల 25న అన్ని మండలాల్లోని తహశీల్దార్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. హత్యలు చేసిన హంతకులను శిక్షించాలని, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆయన కోరారు. మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణరు భార్య అమృత సాహసోపేత నిర్ణయం తీసుకున్నదనీ, తన భర్త ఆశయం కోసం పోరాడుతానని ముందుకొచ్చిందని గుర్తుచేశారు. ఆమె తండ్రి అక్రమంగా సంపాదించిన ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, ఎవరైనా బాధితులుంటే వారికి ఇచ్చేయాలనీ, తనకు రావాల్సిన వాటాను తనకు అప్పగించాలని ఆమె కోరుతున్నదని, ఈ డిమాండ్లకు తాము మద్దతిస్తున్నట్టు చెప్పారు. ప్రణరు హత్య కేసులో టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కాంగ్రెస్ నేత ప్రమేయం ఉందనీ, అమృత స్పష్టమైన ఆధా రాలు చూపిస్తున్నదని వివరించారు. కాంగ్రెస్ నేతను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారనీ, మరి వీరేశంపై టీఆర్ఎస్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి హత్యలను పరువు హత్యలుగా కాకుండా, కులదురహంకార హత్యలుగానే చూడాలని ప్రజలు, మీడియాను కోరారు.
24న బీఎల్ఎఫ్ అభ్యర్థుల ఫస్ట్ లిస్టు
బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) అభ్యర్థుల మొదటి జాబితా ఈనెల 24న విడుదల చేయనున్నట్టు బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. 2014 ఎన్నికల్లో సీపీఐ(ఎం) 37 స్థానాల్లో పోటీ చేసిందనీ, ప్రస్తుతం బీఎల్ఎఫ్లో భాగస్వామిగా ఉండటంతో ఇతర పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు నేపథ్యంలో ఈసారి 20 నుంచి 25 స్థానాల్లో పోటీ చేసే అవకాశముందని చెప్పారు. ఎంబీభవన్లో ఆయన విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దొందూదొందేనని అన్నారు. ఒకరిని గెలిపించ డానికో, ఇంకొకరిని ఓడించడానికో బీఎల్ఎఫ్ ఏర్పాటు చేయలేదనీ స్పష్టం చేశారు. 30 ఏండ్ల చరిత్రలో వివిధ పార్టీలతో పొత్తుల నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీల బలం తగ్గిందని, తోక పార్టీలు అనే ముద్ర కూడా పడిందని చెప్పారు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు ఉద్యమం బలపడేందుకు కృషి చేస్తున్నామని, స్వచ్ఛరాజకీయాల కోసం పోరాడుతున్నామని తెలిపారు. బలం తక్కువున్న, బలమైన విధానం ఉందనీ, టీఆర్ఎస్, మహాకూటమి కంటే తమదే ప్రత్యామ్నాయ విధానమని, దీనిపై చర్చకూ సిద్ధమని స్పష్టం చేశారు. మహాజన పాదయాత్ర సందర్భంలో తమను రాళ్లతో కొట్టాలనీ, అడ్డుకోవాలని, నిలదీయాలని కేసీఆర్ పిలుపునిస్తే, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పూలువేసి, ఘనంగా స్వాగతించారని గుర్తుచేశారు. సీపీఐ(ఎం)ను వేలెత్తిచూపే నైతికత ఏ పార్టీకి లేదని, నిబద్ధతతో ఉన్నామని చెప్పారు. ప్రజలకు మంచి ప్రత్యామ్నాయ దారి చూపుతున్నామనీ, మద్దతివ్వడం, ఇవ్వకపోవడం ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. బీజేపీని ఓడించాలని కేంద్ర కమిటీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నదనీ, దీనికి అనుగుణంగా ఆ పార్టీ గెలుస్తుందనే స్థానాల్లో అవసరమైతే బీఎల్ఎఫ్ను పోటీలో నిలుపబోమనీ, గెలిచే అభ్యర్థికి మద్దతిస్తామని చెప్పారు. తెలంగాణ బాగుపడాలంటే బీఎల్ఎఫ్ బలపడాలని కోరారు. జనసేనతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.