Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల కమిటీలపై నేతల గరంగరం
- ఆజాద్ ఎదుటనే నిరసన గళం
- అన్యాయం జరిగిదంటూ మీడియాకెక్కిన నేతలు
- కమిటీల్లో మహిళలకేది స్థానం
- కుంతియా శనిలా దాపురించారు : కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి
కాంగ్రెస్లో రగులుతున్న అగ్గి సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ఎదుట భగ్గుమన్నది. రాహుల్ గాంధీ ఆరా తీయకుండా కొత్తవారికి అందలమెలా ఎక్కిస్తారంటూ..ఎన్నికల కమిటీలపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిటీల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించలేదు. అలానే బీసీ,ఇతర సామాజిక వర్గాలకు ప్రాధాన్యత నివ్వకపోవటంతో ఆజాద్ ముందే నేతలు నిరసన గళం విప్పారు. కమిటీల నియామకంపై ఇంత రచ్చ జరిగితే.. సీట్ల కేటాయింపుల్లో ఇంకెంత లొల్లి అవుతుందోనని ఆజాద్ అనుకుంటూ హస్తినకు వెళ్లిపోయారు.
నవతెలంగాణబ్యూరో -హైదరాబాద్
ముందస్తు ఎన్నికల కోసం ఏఐసీసీ నియమించిన కమిటీలపై పార్టీ నేతలు గరంగరమవుతున్నారు. తమకు అన్యాయం జరిగిదంటూ అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. కలిసి కట్టుగా ఉంటూ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలంటూ నీతులు చెప్పుతున్న పార్టీ నేతలు...కమిటీల్లో తగిన ప్రాధాన్యత ఎందుకు కలిపిించలేదని ప్రశ్నిస్తున్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి, ముక్కు, మొహం తెలియని వారికి కమిటీల్లో ప్రాధాన్యత కల్పించడం పట్ల తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతున్నది. పార్టీయే సర్వస్వమనుకుంటున్న నేతలకు ఈ కమిటీల్లో ప్రాతినిధ్యం కల్పించకపోవడంతో తమ అనుయాయుల వద్ద తలెత్తుకోలేకపోతున్నామని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో ఉండే మమ్మల్ని కమిటీలో ఎక్కడో పెట్టారని, వార్డు మెంబర్ కూడా గెలవని, వారికి కమిటీల్లో ప్రాధాన్యత ఇచ్చారని ఎమ్మెల్సీ రాజగోపాల్రెడ్డి ఫైరయ్యారు. 'కుంతియా ఎక్కడికెళ్ళి వచ్చావు. మాకు శనిలాగా దాపరించావు. బ్రోకర్ నా కొడుకులను అందరిని కమిటీల్లో వేశారు' అని విరుచుకపడ్డారు. పార్టీ తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్లే 2014లో ఓడిపోయామని, నిన్న మొన్న పార్టీలలో చేరి జైలుకు వెళ్లి వచ్చిన నాయకులకు కూడా పెద్ద పదవులు ఇచ్చారని బహిరంగంగానే ఆరోపణలు చేశారు.
హన్మంతన్న సంచలన వ్యాఖ్యలు
మాజీ ఎంపీ వి హనుమంతరావుకు కమిటీలపై కోపమెచ్చింది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగిస్తామని గతంలో అధిష్టానం హామీ ఇచ్చిన్నట్టు ప్రచారం జరిగింది. రాష్ట్రం నుంచి ఆ ప్రతిపాదనను అధిష్టానానికి పంపించినట్టు తెలిసింది. దీనిపై ఆయన కూడా అధిష్టానాన్ని కోరినట్టు సమాచారం. చివరి నిమిషంలో ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు రాకపోవడంతో ఆయనకు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిటీలు ప్రకటించగానే ఆయన అలిగివెళ్లిపోయారు. దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్కు కాంగ్రెస్లో కోవర్టులు ఉన్నారని, అందుకే తనకు పదవి రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. 1989లోనే తాను ప్రచార కమిటీ చైర్మెన్గా ఉండి పార్టీని అధికారంలోకి తెచ్చినట్టు గుర్తు చేశారు. పార్టీలో ఎవరెవరూ కోవర్టులు ఉన్నారో రాతపూర్వకంగా రాహుల్గాంధీకి అందిస్తానని చెప్పారు. ఇదిలా ఉండగానే వీహచ్ను గులాంనబీ ఆజాద్ను బుజ్జగించారు. సర్దుబాటు చేశారు.
కొత్త వారికి కూర్చీలు...మాకేమో నేలనా?
పార్టీలో నిన్నగాక మొన్న చేరిన వారికి అందలం...మాకేమో నేలనా అని పార్టీ సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. జైళ్లు, బెయిళ్లు, కోర్టుల చుట్టూ తిరిగే వారికి అందలమెక్కించి తమను అణగతొక్కుతారా? అంటూ పరోక్షంగా రేవంత్రెడ్డినుద్దేశించి ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఎన్ఎస్యూఐ, యూత్కాంగ్రెస్, జాతీయ కార్యదర్శిగా ఎమ్మెల్సీగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తూనే...ఎన్నో అవమానాలు, విమర్శలు భరిస్తూ పార్టీ నమ్ముకుని ఉన్నారని తెలిపారు. ఎన్నికల కమిటీల కూర్పు ఆశించిన విధంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్బీనగర్ మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి కూడా నిరసన గళం వినిపించారు. తనకు కమిటీలో అప్రధానమైన పదవులు ఇచ్చారని, వాటిని తాను స్వీకరించబోనన్నారు.తాను నియోజకవర్గానికి మాత్రమే పరిమితమై పని చేస్తానంటూ ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి కాంగ్రెస్లో చేరే ముందు...ఆర్నెల్ల ముందు కార్యనిర్వాహక అధ్యక్ష పదవి, ఎన్నికలకు ముందు ప్రచార కమిటీ చైర్మెన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రచార కమిటీ చైర్మెన్ వస్తుందని ఆయన ఆశలు పెట్టుకుని సర్వసిద్ధం చేసుకున్నారు. కానీ అధిష్టానం కార్యనిర్వాహక అధ్యక్ష పదవితో సరి పెట్టింది. కోమరెడ్డి వెంకట్రెడ్డి కూడా తన అసంతృప్తిని కుంతియాకు ఫోన్ చేప్పినట్టు వార్తలొచ్చాయి. పెద్దపల్లి విజయరమాణరావు, ఓయూ నేత విజరుకుమార్కు కొత్త కమిటీల్లో ప్రాతినిధ్యం కల్పించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మహిళలకు అన్యాయం
పార్టీలో మహిళలకు అన్ని స్థాయిల్లోనూ ప్రాతినిధ్యం కల్పిస్తామని, 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని రాహుల్ చెప్పినా కొత్త కమిటీల్లో అమలు కాలేదని టీపీసీసీ అధికార ప్రతినిధి, సునీత రావు చెప్పారు. ఆయా కమిటీల్లో పది మందికి ప్రాతినిధ్యం కల్పించి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేఖశారు. మహిళా అధ్యక్షురాలు నేరెళ్ల శారద కూడా మహిళల ప్రాతినిధ్యంపై కినుక వహించారు.
బీసీలపై వివక్ష
కాంగ్రెస్ పార్టీపై బీసీ సామాజిక తరగతి మరింత ఆందోళన చెంతుదున్నారు. జనాభా ప్రాతిపదికన టికెట్లు కావాలని రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇప్పటి వరకు టికెట్లపై ఎలాంటి హామీ రాలేదు. ఎన్నికల కమిటీల్లో కూడా బీసీ సామాజిక తరగతికి అన్యాయం చేశారని ఆ తరగతికి చెందిన నేతలు సీనియర్ నేత నాగయ్య, ఏఐసీసీ జాతీయ కార్యదర్శి మధుయాస్కీగౌడ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. కమిట్లోనే బీసీలకు అన్యాయం చేస్తే...ఇక టికెట్లు ఏం ఇస్తారని యువ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.