Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీవ్రమవుతున్న విషసర్పాల బెడద ొపీహెచ్సీల్లో మందుల కొరత
- మూడు గంటల్లో చికిత్స తప్పనిసరి : వైద్యులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వర్షాకాలంలో పాము కాటు కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఆస్పత్రుల్లో సమయానికి మందులు అందుబాటులో ఉండకపోవడం తో మరణాలు పెద్దసంఖ్యలో ఉంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల రైతులు పాము కాటుకు గురవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో చేరుతున్న బాధితుల సంఖ్య రోజురో జుకూ పెరుగుతోంది. పాము కాటుతో పాటు ఇతర విషపు పురుగులు కుట్టి ఆస్పత్రుల పాలవుతున్నవారి సంఖ్య కూడా భారీగానే ఉంటోంది. గతేడాది రాష్ట్రంలో పాముకాటు కేసులు 1,645 కేసులు నమోదైతే.. ఈ సారి 1,850 నమోదయ్యాయి. పాము కాటు మందు యాంటీ స్నేక్ వీనమ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో లేకపోవడంతో 50కి పైగా మృతి చెందినట్టు అధికారుల అంచనా. మందుతోపాటు వెంటిలేటర్ సపోర్ట్, నిష్ణాతులైన వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో వారంతా ప్రయివేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తూ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. గత మూడు రోజుల క్రితం మహబూబ్నగర్ జిల్లా నారాయణపేటలో ఇద్దరు పాముకాటుకు గురయ్యారు. చికిత్స నిమిత్తం బంధువులు సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా మందు కొరవడటంతో మృత్యువాతపడ్డారు. రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి. కేవలం జిల్లా ఆస్పత్రుల్లోనే స్నేక్ మెడిసిన్ అందుబాటులో ఉన్నట్టు తెలిసింది. దేశంలో దాదాపు 250 జాతుల పాములుంటే వాటిలో 52 విషసర్పాలు ఉన్నాయి. మన ప్రాంతంలో కనిపించే పాముల్లో 5 జాతులు మాత్రం అత్యంత విషపూరితమైని. ఇవి కాటేసిన మూడు గంటల్లో మనిషి చనిపోతాడు. ప్రథమ చికిత్స చేస్తే ఆ 3 గంటల వ్యవధిలోనే చేయాలి. లేనిపక్షంలో ప్రాణాలకు ముప్పు తప్పదు. కాటువేసిన పాము విషపూరితమైనదా కాదా అని తెలుసుకోవాలంటే కరిచిన చోట ఎన్ని గాట్లున్నాయో పరిశీలించాలి. ప్రమాదకరమైన కట్లపాము, నాగుపాము, తాచుపాము కాటేస్తే వీటి విషం నేరుగా కేంద్ర నాడీ మండలం, ఊపరితిత్తులపై పడుతుంది. దీంతో హృదయ స్పందన ఆగి వెనువెంటనే మరణించే ప్రమాదం ఉంటుంది. రక్తపింజర విషం ఎక్కువగా రక్త నాళాలపై ప్రభావం చూపుతుంది. రక్తనాళాలు చిట్లి నోటి నుంచి రక్తం వస్తుంది. రక్త నాళాల్లో రక్తప్రసరణ ఆగిపోతుంది. రక్తం గడ్డ కట్టడం వలన కాటుకు గురైన వ్యక్తి మరణిస్తాడు. తాచుపాము, కట్లపాము, రక్తపింజర కాటేస్తే రెండు గాట్లు పడుతాయి. ఎక్కువ గాట్లు కన్పిస్తే అది సాధారణ పాముగా గుర్తించవచ్చు. విషసర్పం కాటేస్తే సూదితో గుచ్చితే చుక్కగా రక్తం వచ్చినట్టుగా, రెండుచోట్ల మాత్రమే కోరల కాట్లు, రక్తపు చుక్కలు కన్పిస్తాయి. పాము కాటు వేయగానే మొదట గుర్తించడం అవసరం. నిద్రలో పాము కాటేస్తే కొందరు గుర్తించలేక చనిపొతున్నారు. కొందరు మద్యం మత్తులో ఉండి పాము కాటు గుర్తించలేని పరిస్థితిలో మరణిస్తున్నారు. పాము కరిచినట్టు గుర్తించిన వెంటనే నిమిషాల వ్యవధిలో అప్రమత్తమవ్వాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. విషం రక్తంలో కలిసి గుండెకు చేరితే ప్రమాదానికి దారితీస్తుంది.
జాగ్రత్తలు తప్పనిసరి
రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లేటప్పుడు మోకాళ్ల వరకు ఉండే గమ్ బూట్లను ధరిస్తే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. పాములు కేవలం శబ్ద తరంగాలను గ్రహించి అప్రమత్తమవుతాయి. అందువల్ల శబ్దం చేసేలా అడుగులు వేయడం, ఏదోలా చప్పుడు చేయడం వల్ల వాటిని గ్రహించి పాములు అప్రమత్తమై అక్కడి నుంచి వెళ్లిపోతాయి. పాదం వరకు కప్పి ఉంచే పంచెలు, లుంగీలు, ప్యాంట్లు వేసుకొని వెళ్లడం మంచిది. రాత్రిపూట పొలానికి వెళ్లాల్సి వస్తే టార్చిలైటు, కర్ర తీసుకెళ్లడం తప్పనిసరి. కొన్ని మందులు పాముకాట్ల నుంచి తప్పించుకొనే పద్ధతులు తెలియడం కూడా అవసరమే. కాటు వేసిన పై భాగంలో కట్టు కట్టి కరిచిన చోట కొత్త బ్లేడ్తో కత్తిరించి విషపు రక్తాన్ని పిండివేయాలి. అలా చేయడం ద్వారా శరీరంలోకి ప్రవేశించిన విషం గుండెకు చేరకుండా ఉంటుంది. తదనంతరం వైద్యున్ని సంప్రదించడం ద్వారా ప్రాణాలు నిలుస్తాయి. మరోవైపు, పాము కాటు కేసుల కోసం యాంటీ వీనమ్ మందులను ప్రభుత్వాసుపత్రుల్లో సిద్ధంగా ఉంచామని అధికారులు చెబుతున్నారు.
సుదూర ప్రాంతాల్లో ఉన్న గ్రామీణులు పాము కాటు వేయగానే దగ్గర్లలోని ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించుకోవాలి. విషసర్పం కాటుకు గురైనప్పుడు నోటి వెంట నురుగు, తలనొప్పి, తలతిరుగుడు, చూపులో రెండు దృశ్యాలు వంటి లక్షణాలు కన్పిస్తాయి. వీటిని ప్రీ పెరాల్టిక్ లక్షణాలుగా విభజిస్తారు. ఈ లక్షణాలు కన్పిస్తే రోగికి యాంటి వీనమ్ డోస్ను ఇవ్వాలి. మొదట 10 వాయిళ్ల యాంటీ వీనమ్, ఆరు గంటల వ్యవధి తరువాత మరో 10 వాయిళ్ల డోస్ ఇవ్వాలి. 6 గంటల తరువాత కూడా రోగి ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేకుంటే చివరి డోస్గా 5 నుంచి 10 వాయిళ్ల యాంటి వీనమ్ ఇవ్వాలని వైద్యులు చెబుతున్నారు. పాములకు మనం ఏదైనా అపాయం తలపెడతామోనన్న భయంతోనే అవి కాటేస్తుంటాయి. వాటిని పొరపాటున కాలితో తొక్కేయడమో లేక గడ్డి కోస్తున్నపుడు వాటిని పట్టుకోవడమో, తాకడమో చేయడంతోనే అవి కాటేస్తున్నాయని గుర్తించాలి.