Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వీలైనంత త్వరలో అర్బన్ ఫారెస్ట్ పార్కులు అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రభుత్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కె జోషి చెప్పారు. హరితహారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ చుట్టూ తలపెట్టిన అర్బన్ ఫారెస్ట్ పార్కుల అధ్యయనంలో భాగంగా శుక్రవారం అధికారుల బృందం మూడు పార్కులను సందర్శించింది. సీఎస్ నేతృత్వంలో ఇప్పటికే అభివృద్ధి పర్చిన అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో సందర్శకుల సౌకర్యాలు, సహజసిద్ధమైన అడవిని కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలపై అధికారులు రోజంతా క్షేత్రస్థాయి పర్యటన చేశారు.ఏడు శాఖల ఆధీనంలో త్వరలో పనులు ప్రారంభం అవుతున్న 59 అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో ఎలాంటి సౌకర్యాలు ఉండాలి, సందర్శకుల కోసం ఏర్పాట్లతోపాటు అటవీ ప్రాంతాల పునరుజీవనం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై ఇతర శాఖల అధికారులకు ఈ పర్యటన ఏర్పాటు చేసినట్టు ప్రధాన అటవీ సంరక్షణ అధికారి పీకె ఝా తెలిపారు. అనంతరం జోషి మాట్లాడుతూ ఔటర్ రింగ్రోడ్డు చుట్టూ పట్టణ ప్రాంతాలు, కాలనీలకు సమీపంలో వీలైనన్ని అర్బన్ పార్కులు ఏర్పాటు చేసేందుకు సీఎం సుముఖంగా ఉన్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో పార్కులే ప్రజలకు ఆస్తులుగా మిగులుతాయని చెప్పారు. అటవీశాఖ నేతృత్వంలో 17, జీహెచ్ఎంసీ2, హెచ్ఎండీఏ 16, టూరిజం 7, అటవీ కార్పొరేషన్ 4, టీఎస్ ఐఐసీ 10, మెట్రోరైల్ 2 మొత్తం 59 పార్కుల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, సుమారు రూ.500 కోట్ల వ్యయంతో ఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ పర్యటనలో అటవీ శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజరు మిశ్రా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, హెచ్ఎండిఏ కమిషనర్ జనార్థన్రెడ్డి, టూరిజం కార్యదర్శి బుర్రా వెంకటేశం, సీఎం ఓఎస్డీ ప్రియాంకవర్గీస్, రంగారెడ్డి జిల్లా కలెక్టరు లోకేష్ కుమార్ తదితరులు ఉన్నారు.