Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కండ్లజోళ్లు లేక వృద్ధుల ఇక్కట్లు
- ఆపరేషన్లకు ప్రయివేటు దవాఖానాల విముఖత
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 37,738 మంది ఎదురుచూపు
నవతెలంగాణ-ఖమ్మం ప్రతినిధి
భద్రాద్రి జిల్లా సుజాతనగర్ మండలానికి చెందిన బానోత్ ద్వాలికి కంటికి దెబ్బతగిలింది. చూపు మందగించింది. చీకట్లో పనులు చేసుకోలేకపోతోంది. ఇటీవల ప్రభుత్వం కంటివెలుగు పథకంలో ఉచితంగా కంటిపరీక్షలు చేసి, కండ్లజోడు ఇస్తున్నారని తెలుసుకుని దగ్గరలోని వైద్యశిబిరానికి వెళ్లింది. పరీక్షలు చేయించుకుంది. నెలరోజుల తరువాత వచ్చి కండ్లజోడు తీసుకోవాలని తిప్పిపంపారు. దీంతో ఎంతో ఆశతో వైద్యశిóరానికి వెళ్లిన ద్వాలి ఉసూరుమంటూ ఇంటి దారిపట్టింది. ఇది ఒక్క ద్వాలీకి ఎదురైన అనుభవమే కాదు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో దాదాపు కంటిపరీక్షలు చేయించుకున్న వారిలో సగం మందికి ఎదురవుతున్న అనుభవం. ఇదీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా అమలుచేస్తున్నట్టు చెబుతున్న కంటివెలుగు అసలు కథ అని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇందుకు సంబంధించి 'నవతెలంగాణ' పరిశీలనాత్మక కథనం...
టీఆర్ఎస్ ప్రభుత్వం ఆగస్ట్15న ప్రారంభించిన కంటివెలుగు పథకం క్షేత్రస్థాయిలో కునుకుతీస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పథకం ప్రారంభానికి ముందు ప్రభుత్వం బాగా ప్రచారం చేయడంతో ప్రజల్లో ఎన్నో ఆశలు రేకెత్తాయి. వారి వారి ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో నిర్వహిస్తున్న వైద్యశిబిరాల్లో పరీక్షలు చేయించుకునేందుకు వచ్చి కండ్లజోళ్లు లేక తిరిగి వెళుతున్నారు. అన్ని రకాల కంటిచూపు తేడాలకు గాను ఒకే రకమైన జోడును అందిస్తున్నారని మరి కొందరు విమర్శిస్తున్నారు. అంతేకాక ప్రత్యేక ఆపరేషన్లు కావాల్సిన వారికి ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయడానికి వాయిదాలు వేస్తున్నారని లబ్దిదారులు విమర్శిస్తున్నారు.
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఇదీ లెక్క...
భద్రాద్రిజిల్లాలోని 2 రెవెన్యూ డివిజన్లు, 23 మండలాల్లో 7.2లక్షల మందికి కంటిపరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకుగానూ 27 బృందాలను నియమించారు. ఈ పథకం కింద ఇప్పటి వరకూ 7.2లక్షల మందికిగాను 1,71,715 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. వీరిలో 47,403 మందికి అద్దాలు పంపిణీ చేశారు. ఇంకా 10,767 మంది లబ్దిదారులకు ఆపరేషన్లు అవసరమని రిఫర్ చేశారు. వీరిలో కేవలం 472 మందికి మాత్రమే శస్త్రచికిత్సలు నిర్వహించారు. మిగిలిన వారికి జనవరి తరువాత ఆపరేషన్లు చేస్తారని చెప్పిపంపుతున్నారని లబ్దిదారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆపరేషన్ల కోసం 10,767మంది ఎదురుచూస్తున్నారు. ఇంకా సుమారు 5లక్షల మందికి పరీక్షలు చేయాల్సి ఉంది.
ఖమ్మం జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 21మండలాల్లోని 350 రెవెన్యూ గ్రామాల్లోని 36బృందాలతో 24ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పరిధిలోని 14.39లక్షల మందికి వైద్యపరీక్షలు చేసే విధంగా పథకాన్ని రూపొందించారు. ఇప్పటికి (ఆదివారం నాటికి) 2.24 లక్షల మందికి వైద్య పరీక్షలు పూర్తి చేశారు. ఇందులో 85వేల మందికి కండ్లజోళ్లు అందించారు. మరో 49,600 మందికి కండ్లజోళ్లు ప్రత్యేకమైనవి అత్యవసరమని రాష్ట్ర కంటివెలుగు కార్యాలయానికి సిఫార్సు చేశారు. ఇవిగాక 27వేల మందికి శస్త్రచికిత్సలు అవసరమని రిఫర్ చేశారు. కానీ వీరికి ప్రస్తుతం శస్త్ర చికిత్సలు జరపడానికి ప్రయివేటు ఆస్పత్రుల్లో వైద్యులు ముందుకు రావడం లేదని లబ్దిదారులు వాపోతున్నారు.
వరంగల్ ఘటనే ఆలస్యానికి కారణం..?
ఇటీవల వరంగల్ జిల్లాలో కంటివెలుగు కార్యక్రమంలో కొందరికి కంటిచూపు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల శస్త్ర చికిత్సలు చేయడంలో ఆలస్యం చోటుచేసుకున్నట్టు కంటివెలుగు అధికారులే వెల్లడిస్తున్నారు. ప్రభుత్వం పథకంలో అపశృతులు చోటుచేసుకోకుండా ఉండేందుకుగాను ఆపరేషన్లకు సంబంధించి కాస్తంత విరామం ఇచ్చినట్టు తెలుస్తోంది.
కండ్లజోడు కోసం వెళితే ఇప్పుడే రాదంటున్నారు
కండ్లు సరిగ కనబడక ఇబ్బంది పడుతున్న. వైద్యశిబిరంలో పరీక్ష చేయించుకుంటే కండ్లజోడు ఇస్తమ న్నారు. రోజూ తిప్పించుకుంటున్నారు. ఇప్పటిదాకా కండ్లజోడు ఇవ్వలేదు. చివరకు నెల తర్వాత వచ్చి తీసుకోమని చావుకబురు సల్లంగ చెప్పారు.
మద్దిబోయిన నాగస్వామి, రాఘవాపురం, లూరుపాడు మండలం
డాక్టర్ల వద్దకు తిరగలేక పోతున్నాను.
కాస్తంత జాప్యం జరుగుతోంది
కంటివెలుగు పథకంలో పరీక్షలు చేసిన తరువాత వివిధ రకాల కంప్లైం ట్లకుగాను లబ్దిదారులను గుర్తిస్తు న్నాం. ఇందులో సరిపోయే వారికి అక్కడి కక్కడే కండ్లజోళ్లు ఇస్తున్నం. శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి పాల్వంచలోని ఎల్వీఆర్, హైదరాబాద్లోని సరోజిని కంటి ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నాం. జాప్యాన్ని సవరించి మెరుగైన సేవలు అందిస్తాం.
ఎల్.చంద్రశేఖర్, భద్రాద్రిజిల్లా కంటి వెలుగు అధికారి
ఇది రెండేండ్ల కార్యక్రమం
కంటివెలుగు అనేది రెండేండ్ల కార్యక్రమం. దీనిలో శస్త్ర చికిత్సల కోసం రిఫర్చేసిన వారికి నిరంతరంగా ఆపరేషన్లు జరుగుతూనే ఉంటాయి. దీనిపై లబ్దిదారులు ఆందోళన చెందవద్దు. సాధ్యమైనంత తొందరగానే శస్త్ర చికిత్సలు పూర్తయ్యేందుకు కృషి చేస్తాం. ప్రతి ఒక్కరికీ కళ్లజోడు పంపిణీ చేస్తాం.
డాక్టర్ ఎల్ భాస్కర్, డీఎం హెచ్ఓ, భద్రాద్రి జిల్లా