Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని కాలేజీల్లోనూ అమలుకు కసరత్తు
- ఓయూ, పీయూ పరిధిలో ఈనెలాఖరులోపే
- టీఎస్టీఎస్తో వర్సిటీల ఒప్పందం
- హాజరు పెంపు, నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో బయోమెట్రిక్ విధానం అమలుకు నవంబర్ 10 డెడ్లైన్గా విధించారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి, విశ్వవిద్యాలయాలు, కమిషనర్ ఆఫ్ కాలేజీయేట్ ఎడ్యుకేషన్ నిర్ణయించాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ), పాలమూరు విశ్వవిద్యాలయం (పీయూ) పరిధిలో ఈనెలాఖరులోపు వర్సిటీ కాలేజీలు, ప్రభుత్వ, ప్రయివేటు కాలేజీల్లో బయోమెట్రిక్ అమలు చేయాలని నిర్ణయించాయి. ఇప్పటికే మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ) పరిధిలో బయోమెట్రిక్ విధానం అమలవుతున్నది. ఇక మిగిలిన జేఎన్టీయూ, కాకతీయ, శాతవాహన, తెలంగాణ విశ్వవిద్యాలయాల పరిధిలోని కాలేజీలు, వర్సిటీ కాలేజీల్లో వచ్చేనెల 10వ తేదీ నాటికి బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. విద్యార్థులు, అధ్యాపకుల హాజరును బయోమెట్రిక్ విధానం ద్వారా పరిశీలించనున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని గవర్నర్, వర్సిటీల చాన్సరల్ ఈఎస్ఎల్ నరసింహన్ వీసీల సమావేశంలో ఆదేశించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. వంద మందికి ఓ బయోమెట్రిక్ యంత్రం కావాల్సి ఉంటుంది. ఒక్కో విద్యార్థిపై 16 పైసలు ఖర్చవుతుంది. ఈ వ్యయమంతా విశ్వవిద్యాలయాలే భరిస్తాయి. కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థుల నుంచి ఒక్క పైసా వసూలు చేసే అవకాశముండదు. పిల్లల మీద అనవ సరంగా భారం వేయొద్దనే ఈ నిర్ణయం తీసుకు న్నారు. ఇప్ప టికే పాలిటెక్నిక్ కాలేజీల్లో బయోమెట్రిక్ విధానం అమలవుతున్నది. అందులో భాగంగానే గురువారం తెలంగాణ స్టేట్ టెక్నా లాజికల్ సర్వీసెస్ (టీఎస్టీఎస్)తో విశ్వవిద్యాలయాలు ఒప్పందాలు చేసుకున్నాయి. గురువారం రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ (రూసా) కార్యాలయంలో అన్ని విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లు, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్ ఆర్ లింబాద్రి, కాలేజీయేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్, టీఎస్టీఎస్ అధికారులతో సమావేశం జరిగింది. మొదటగా 300 మంది విద్యార్థులకు పైగా ఉన్న కాలేజీలన్నింటీలోనూ బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత అన్ని కాలేజీల్లోనూ తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుందని ప్రకటించారు. విశ్వవిద్యాలయం అధికారులే బయోమెట్రిక్ అమలు, పర్యవేక్షణకు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. సమస్యలేమైనా వస్తే నోడల్ అధికారులే పరిష్కరిస్తారు. హాజరుశాతం, బోధనలో నాణ్యత పెరుగుతుందని ఉన్నత విద్యామండలి చైర్మెన్ పాపిరెడ్డి, వైస్ చైర్మెన్ ఆర్ లింబాద్రి చెప్పారు. నాణ్యమైన విద్య విద్యార్థులకు అందించడమే లక్ష్యమని అన్నారు. విద్యార్థులు తరగతులకు హాజరుకావాలని, అధ్యాపకులు బోధించాలని చెప్పారు. మొదటి విడతలో డిగ్రీస్థాయిలోని కోర్సులకు బయోమెట్రిక్ విధానం అమలు చేస్తామన్నారు. ఆ తర్వాత పీజీ తరగతులకు విస్తరింపచేస్తామని వివరించారు.