Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తప్పు అని తేలిన ప్రశ్నలకు మార్కులు
- సిలబస్లో లేని ప్రశ్నలుంటే అభ్యర్థులకు న్యాయం చేస్తాం
- 20 వేలకుపైగా అభ్యంతరాలు అందాయి: నవతెలంగాణతో ప్రత్యేకంగా మాట్లాడిన టీఎస్ఎల్పీఆర్బీ చైర్మెన్ వివి శ్రీనివాస్రావు
* ప్యారక వాసుదేవాచారి
రాష్ట్రంలో ఇటీవల జరిగిన కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షా ప్రశ్నావళికి సంబంధించి అభ్యర్థుల నుంచి అందిన ప్రతి ఒక్క అభ్యంతరాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, త్వరలోనే తుది 'కీ'ని ప్రకటిస్తామని రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మెన్ వివి శ్రీనివాసరావు తెలిపారు. ఈ విషయంలో ఏ ఒక్క అభ్యర్థీ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఆయన గురువారం నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధితో మాట్లాడుతూ స్పష్టం చేశారు. గతనెల 30న కానిస్టేబుల్(సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పీ, పీటీవో, ఎస్పీఎఫ్, ఫైర్మెన్, వార్డర్) పోస్టులకు జరిగిన అర్హత పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4లక్షల 78 వేల మందికి పైగా అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. అయితే కానిస్టేబుల్ పరీక్షా పత్రం, ఎస్ఐ పరీక్షా పత్రంకంటే కఠినంగా ఉందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల అర్హత పరీక్షకు సంబంధించిన 'కీ'ని బోర్డు విడుదల చేసింది. ఇందులో పలు ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు సరిగాలేవని, మరికొన్ని ప్రశ్నలు అభ్యర్థులను కన్ఫ్యూజన్లో పడేసేవిగా ఉన్నాయనే ఆరోపణలొచ్చాయి. అలాగే మరికొన్ని ప్రశ్నలు అసలు సిలబస్కు సంబంధించినవే కావని, అవి వరల్డ్ జాగ్రఫీకి సంబంధించినవని మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే బోర్డు ప్రకటించిన 'కీ'లో ఏవేని సందేహాలు, అభ్యంతరాలున్న పక్షంలో వాటిని తమకు తెలియజేయాలని బోర్డు కోరింది. అంతేగాక తమ అభ్యంతరానికి సంబంధించిన ఆధారాన్ని కూడా పంపించాలని కోరింది. ఈ మేరకు గత 8వ తేదీ నాటికి దాదాపు 20వేలకు పైగా అభ్యంతరాలు బోర్డు వెబ్సైట్కు అందాయి. ఇందులో దాదాపు 12 నుంచి 15 ప్రశ్నలకు సంబంధించిన అభ్యంతరాలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా 'హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పార్టీపై నిషేధాన్ని నిజాం ప్రభుత్వం ఎప్పుడు ఎత్తివేసింది' అనే ప్రశ్నపై ఐదు వేలకు పైగా అభ్యంతరాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే లక్షలాది మంది కానిస్టేబుల్ అభ్యర్థులలో మెదులుతున్న సందేహాలను టీఎస్ఎల్పీఆర్బీ చైర్మెన్ శ్రీనివాసరావు దృష్టికి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి గురువారం తీసుకురాగా ఆయన సందేహాల నివృత్తి దిశగా సమాధానాలు ఇచ్చారు. ప్రశ్నాపత్రం చాలా కఠినంగా ఉన్నదనేది నిజం కాదని పదో తరగతి, ఇంటర్మీడియెట్ స్థాయి పరిధిలోనే ఈ పేపర్ను నిపుణులు రూపొందించారని శ్రీనివాసరావు తెలిపారు. ముఖ్యంగా కొన్ని ప్రశ్నల సమాధానాలకు సంబంధించి తాము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ విషయంలో ఏ ఒక్క అభ్యర్థికీ అన్యాయం జరగకుండా చూడాలనేదే తమ లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు. వరల్డ్ జాగ్రఫీ తమ సిలబస్లో లేదని, అయినా అందులోంచి పదికిపైగా ప్రశ్నలిచ్చారనే అభ్యంతరాన్ని ఆయన దృష్టికి తీసుకురాగా... నిజానికి అది ఫిజికల్ జాగ్రఫీ అని, వరల్డ్ జాగ్రఫీ కాదని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అయినప్పటికీ అందులో నిజంగానే అభ్యర్థులు వెలిబుచ్చిన సందేహాలలో ఏమేరకు న్యాముందనేది కూడా తాము నిపుణులతో చర్చిస్తున్నామన్నారు. ఒకవేళ ప్రశ్నా పత్రంలో ఏవేని ప్రశ్నలు నిజంగానే అవుట్ ఆఫ్ సిలబస్లో నుంచి వచ్చాయని తేలితే తప్పకుండా ఆ ప్రశ్నలకు సంబంధించి అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. 'తెలంగాణ ప్రజా సమితి... పార్టీగా ఎప్పుడు అవతరించింది' అనే ప్రశ్నకు సంబంధించిన సమాధానం ఇంటర్ ఇంగ్లీష్ పాఠ్యపుస్తకంలో ఒకటి ఉండగా, తెలుగు బుక్లో మరోలా ఉందనేది ఆయన దృష్టికి తేగా 'తర్జుమాకు సంబంధించి పొరపాటు జరిగి ఉండొచ్చు దానిపైనా తామే సీరియస్గానే చర్చిస్తున్నామ'ని శ్రీనివాసరావు సమాధానమిచ్చారు. ఒకవేళ ప్రశ్న లేదా సమాధానాలు తప్పుగా ఇచ్చారని తేలితే వాటికి తప్పకుండా ఒక మార్కును ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రతి అభ్యర్థీ ఎంతగా కష్టపడి చదువుతున్నారో తమకు తెలుసని, ఇచ్చిన ప్రశ్నకు కచ్చితమైన సమాధానం రాసిన అభ్యర్థులెవ్వరికీ అన్యాయం జరగదన్నారు. అలాగే ఏదేని సందేహాలతో కూడిన ప్రశ్నలు వాటికి సమాధానాలు ఉన్న వాటి గురించి కూడా తాము పరిశీలించి అభ్యర్థులకు న్యాయం చేస్తామని తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించిన తుది 'కీ' ని విడుదల చేసి నెగ్గిన అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటిస్తామన్నారు. తదుపరి దేహధారుఢ్య పరీక్ష, తుది పరీక్షల నిర్వహణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన సమాధాన మిచ్చారు. మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అవి ముగిశాకే నిర్వహించడం మంచిదనే సూచనలు తమకు వస్తున్నాయని ఆయన తెలిపారు. ఒక విధంగా చలి కాలం రావడం వలన అభ్యర్థులు కూడా దేహధారుఢ్య పరీక్షలో ఇబ్బంది లేకుండా పాల్గొనే అవకాశాలు ఉన్నాయని శ్రీనివాసరావు తెలిపారు.