Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అండర్ 15 విభాగంలో బాడ్మింటన్ ఛాంపియన్షిప్ సాధించిన మేఘనారెడ్డికి డీజీపీ అభినందనలు
నవతెలంగాణ- ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో పోలీసుల పిల్లలు కూడా అన్ని రంగాల్లో రాణించాలని డీజీపీ మహేందర్రెడ్డి ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇటీవల మయన్మార్లో జరిగిన బాడ్మింటన్ అండర్ 15 విభాగంలో ఏషియన్ ఛాంపియన్షిప్ను సాధించిన ఇన్స్పెక్టర్ రవీందర్రెడ్డి కుమార్తె ఎం.మేఘనారెడ్డిని ఆయన గురువారం అభినంధించారు. మేఘనారెడ్డిని డీజీపీ కార్యాలయానికి పిలిపించి జ్ఞాపికను అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పోలీసుశాఖలో కానిస్టేబుల్ మొదలుకుని ఉన్నతాధికారుల పిల్లలు చదువుతోపాటు క్రీడలలో మంచి ప్రతిభ కనబరుస్తున్నారని అన్నారు. తాజాగా మేఘనారెడ్డి మయన్మార్లో జరిగిన బాడ్మింటన్ ఛాంపియన్షిప్లో నాలుగు దేశాల క్రీడాకారులపై విజయం సాధించడం సంతోషకరమని తెలిపారు. పోలీసు విధుల్లో క్షణం తీరిక లేకుండా ఉంటూ ఇన్స్పెక్టర్ రవీందర్రెడ్డి తన కూతురిని బాడ్మింటన్లో ప్రోత్సహించడాన్ని ఆయన మెచ్చుకున్నారు. వివిధ క్రీడలలో తమ పిల్లలను ప్రోత్సహిస్తున్న అధికారులు పోలీసు శాఖలో ఎంతోమంది ఉన్నారని ఆయన అన్నారు. వారికి అవసరమైన ప్రోత్సాహాన్ని ఇవ్వడంలో తాము ఎప్పుడు వెనుకంజ వేయబోమని హామీ ఇచ్చారు. ఈనెల 3 నుంచి 7 వరకు జరిగిన బాడ్మింటన్ అండర్ 15 ఛాపియన్షిప్లో మేఘనారెడ్డి తనజోడీ తస్లిమ్మీర్(గుజరాత్)తో కలిసి చాంపియన్షిప్ గెలుచుకుందని తండ్రి రవీందర్రెడ్డి తెలిపారు. భారతీయ విద్యాభవన్లో మేఘనా ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్నదని ఆయన వివరించారు.