Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ పిలుపు
- కార్మిక వ్యతిరేక టీఆర్ఎస్ను ఓడించాలి
- అవకాశవాద కాంగ్రెస్, టీడీపీలను తిరస్కరించాలి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నాలుగేండ్లు నిరంకుశంగా వ్యవహరించి.. కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడిన టీఆర్ఎస్ను ఓడించాలని సీఐటీయూ పిలుపునిచ్చింది. ఎలాంటి సూత్రబద్ధ విధానాలు లేకుండా అవకాశవాద వైఖరితో ప్రజల ముందుకు వస్తున్న కాంగ్రెస్, టీడీపీలను తిరస్కరించాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేసింది. ఇదే సమయంలో వామపక్ష, సామాజిక శక్తుల ఐక్యతకు, బలోపేతానికి కృషి చేస్తున్న సీపీఐ (ఎం), బీఎల్ఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని కార్మికవర్గానికి పిలుపునిచ్చింది.
గురువారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశమైంది. ఈ సందర్భంగా కార్మిక, ప్రజా వ్యతిరేక టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలను ఓడిద్దామని పేర్కొంటూ ఆమోదించిన తీర్మానాన్ని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు, ప్రధాన కార్యదర్శి ఎమ్.సాయిబాబు పత్రికలకు విడుదల చేశారు. భౌగోళిక తెలంగాణ మాత్రమే ప్రజా, కార్మిక సమస్యల పరిష్కారానికి మార్గం కాదని కౌన్సిల్ ఈ సందర్భంగా పేర్కొంది. ప్రత్యామ్నాయ విధానాలతో సామాజిక తెలంగాణను నిర్మించుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలని సూచించింది. ఇందుకోసం నిరంతర కృషిని కొనసాగిస్తామనే నిబద్ధతను ప్రకటించిన బీఎల్ఎఫ్కు కార్మికవర్గం అండగా నిలబడాలని కోరింది. సీఐటీయూ అంతిమ లక్ష్య సాధన కోసం ఆర్థిక, సామాజిక దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చింది. సామాజిక న్యాయం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) ఏర్పడిందని తెలిపింది. తాము అధికారంలోకి వస్తే ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వాన్ని అన్ని వర్గాల్లోనూ సాధిస్తామంటూ బీఎల్ఎఫ్ ప్రకటించిందని పేర్కొంది. ఇదే రకంగా కార్మికులు, కర్షకులు, శ్రామికులు, విద్యార్థులు, యువత, మహిళలు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, వివిధ సామాజిక తరగతులను అభివృద్ధి చెందించేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ ప్రణాళికను బహిరంగంగా ప్రకటించిందని తెలిపింది. ఈ అంశాలన్నింటినీ కార్మికవర్గం గుర్తించాలని కోరింది. కార్మికవర్గ శత్రువులను ఓడించటం, మిత్రులను గెలిపించటమనే రాజకీయ కర్తవ్యాన్ని నేటి కార్మికవర్గం తీసుకోవాలని కౌన్సిల్ విజ్ఞప్తి చేసింది. ఈ దిశగా కార్మికులను నడిపించేందుకు సీఐటీయూ కమిటీలు, అనుబంధ యూనియన్లు ఎన్నికల సమరంలో చైతన్యయుతంగా పాల్గొనాలని కోరింది. సమావేశంలో సీఐటీయూ సీనియర్ నేత పి.రాజారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.సుధాభాస్కర్, ఎస్ఎన్ రెడ్డి, ఎస్.రమ, ఆంథోల్ నియోజకవర్గ బీఎల్ఎఫ్ అభ్యర్థి పి.జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.