Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంట్రిబ్యూటరీ పింఛన్ స్కీం (సీపీఎస్)ను అమల్లోకి తెచ్చిన పార్టీ భారీ మూల్యం చెల్లించక తప్పదని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్యూటీఎఫ్) హెచ్చరించింది. గురువారం హైదరాబాద్లోని టీఎస్యూటీఎఫ్ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. టీఎస్యూటీఎఫ్ అధ్యక్షులు సిహెచ్ రాములు, ప్రధాన కార్యదర్శి చావ రవి ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 1.26 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు సామాజిక భద్రతకు సమస్యగా మారిన సీపీఎస్ను కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పాలకులే అమలు చేశారని తెలిపారు. సీపీఎస్ రద్దు పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పాత పింఛన్ విధానానికి సంబంధించి కేంద్రం కోరిన నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా పీఎఫ్ఆర్డీఏ చట్టంలో చేరి సీపీఎస్ను అమలు చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం లేఖ ఇచ్చిందని తెలిపారు. ఇంకోవైపు ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని చెప్పి కనీసం ఐఆర్ సైతం ప్రకటించకుండా ఉద్యోగుల ఆకాంక్షలను నీరుగార్చిందని పేర్కొన్నారు. పాఠశాలల పర్యవేక్షణను బలోపేతం చేయడంలోగాని, పదోన్నతులను కల్పించడంలోగాని, ఉమ్మడి సర్వీసు రూల్స్ సాధించడంలోగాని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ వహించలేదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలైన సర్వీసు రూల్స్, వంద శాతం ఉపాధ్యాయులకు జూనియర్ లెక్చరర్ల పదోన్నతులు, జూన్ 2న ఐఆర్, పండితులు, పీఈటీల అప్గ్రెడేషన్ వంటి సమస్యలను పట్టించుకోలేదని పేర్కొన్నారు.