Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గొంతుకోసి హతమార్చిన దుండగులు
నవతెలంగాణ- తాడ్వాయి
మంత్రాల నెపంతో గిరిజనుడిని గ్రామ స్తులు దారుణంగా చంపేశారు. ఈ అమా నవీయ ఘటన జయశంకర్ భూపాల పల్లి జిల్లా తాడ్వాయి మండలంలో గురువారం జరిగింది. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం..తాడ్వాయి మండలం భీరెల్లి పంచాయతీ పరిధి ఆశన్నగూడ ఎల్లాపూర్ గ్రామానికి చెందిన మెస్సు సాంబయ్య(60) తన నాలుగెకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సాంబయ్య తండ్రికి మంత్రాలు వస్తాయని, దాంతో గ్రామంలో ఎవరు చనిపోయినా అతను మంత్రాలు చేయడం వల్లే అంటూ గతంలోనూ పలుమార్లు దాడి చేశారు. సాంబయ్య తండ్రి అనారోగ్యంతో గతంలో మృతిచెందాడు. 15రోజుల కిందట గ్రామంలో ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతిచెందాడు. ఇప్పుడు సాంబయ్య మంత్రం వేయడం వల్లే వ్యక్తి మృతిచెందాడని గ్రామస్తులు అనుమానం పెంచుకున్నారు. బుధవారం కామారంలో ఉన్న తన పశువులను చూసేందుకు సాంబయ్య వెళ్లాడు. అక్కడి నుంచి భీరెల్లి వెళ్లి తిరిగి వస్తుండగా జామాయిల్ కోపు వద్ద గ్రామస్తులు మాటువేసి దాడి చేశారు. తీవ్రంగా కొట్టి కత్తితో గొంతు కోశారు. ఘటనాస్థలంలో తొక్కిసలాట జరిగినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. మృతదేహం బోర్ల పడిపోయి ఉంది. సెల్ఫోన్, టార్చిలైట్, గొడుగు చెట్లల్లో పడేశారు. ఈ ఘటన గురువారం ఉదయం వెలుగుచూసింది. మృతుడికి భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఘటనా స్థలాన్ని పస్రా సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్ఐ రవీందర్ పరిశీలించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. గ్రామస్తులను విచారించారు. అనంతరం క్లూస్టీంతో వివరాలు సేకరించారు. దుండగులను త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.