Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
- ఎన్నికల సంఘం గవర్నర్ సహకారం తీసుకోవాలని వ్యాఖ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేకాధికారుల పాలన ఏర్పాటు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. మూడు మాసాల్లోగా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి ప్రత్యేకాధికారుల పాలనకు తెర దించాలని స్పష్టం చేస్తూ గురువారం హైకోర్టు న్యాయమూర్తి ఎం.ఎస్ రామచంద్రరావు తీర్పు చెప్పారు. మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహణకు అన్ని చర్యలు ప్రారంభించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు. వెనుకబడిన కులాల గణన, రిజర్వేషన్ల ఖరారు వంటి చర్యలు చేపట్టాలని, రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నందున గవర్నర్ నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు తీసుకోవాలని తీర్పులో పేర్కొన్నారు. ఎన్నికలు నిర్వహించే వరకూ ప్రత్యేకాధికారుల పాలన కొనసాగేందుకు న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు. పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేకాధికారుల పాలన ఏర్పాటు చేయడం రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంటూ తెలంగాణ గ్రామ పంచాయతీ సర్పంచుల సంఘంతోపాటు పలువురు దాఖలు చేసిన పలు కేసులపై న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ వ్యతిరేకమే అవుతుందని, ప్రత్కేకాధికారుల పాలన కొనసాగింపు కూడా చెల్లదని స్పష్టం చేశారు. ఎన్నికలు నిర్వహించే విషయమై ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిందేగానీ పూర్తి సహాయ సహకారాలు అందించలేదని, సంఘం తీసుకున్న చర్యలు కూడా సమర్ధనీయంగా లేవని తప్పుపట్టింది. ఎన్నికల నిర్వహణకు ప్రక్రియను వెంటనే ప్రారంభించి రాబోయే మూడు మాసాల్లో ఎన్నికలు నిర్వహించాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.