Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లావ్యాప్తంగా ఎవరికివారే ప్రచారహోరు
- ముదురుతున్న గ్రూపుల లొల్లి
- కొన్నిచోట్ల కేటీఆర్ అంతర్గత ప్రోత్సాహం?
నవతెలంగాణ-పెద్దపల్లి ప్రతినిధి
పెద్దపల్లి గులాబీ గూటిలో రెబెల్స్ గంటా మార్మోగుతోంది. ఎవరికివారే ప్రచార హోరును తలపిస్తూ సొంత పార్టీలోనే వ్యతి రేక గళాన్ని వినిపిస్తున్నారు. పెద్దపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే దాస రికి బీసీల గళం ప్రతికూలంగా మారడం, పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఈదశంకర్రెడ్డి, ఎ మ్మెల్సీ భానుప్రసాద్రావు మద్దతు కొరవడడంతో ఆయనకు కష్టంగా మారింది. రామగుండంలో సోమారపు సత్యనారాయణకు కోరుకంటి చందర్, మంథనిలో పుట్టమధుకు సునీల్రెడ్డిల బెడద ఎక్కువైంది. ముదురుతున్న గ్రూపు లొల్లిల నడుమ వేరుకుంపట్లు పెడుతున్న రెబల్స్కు కొన్నిచోట్ల సాక్ష్యాత్తు ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలూ వస్తున్నాయి.
పెద్దపల్లి జిల్లాలో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు దక్కిన నేపథ్యంలో వారిపై అసంతృప్తి, అప్పటికే వేరుకుంపట్లు ప్రారంభించిన కొందరు ఆశావాహులు రెబెల్స్ అవతారమెత్తారు. దీటైనా ప్రచార హోరుతో సవాల్ విసురుతున్నారు. రామగుండంలో టీఆర్ఎస్ నాయకుడు కోరుకంటి చందర్ 2014లో పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డాడు. కాంగ్రెస్ నుంచి గులాబీ తీర్థం పుచ్చుకున్న సోమారపు సత్యనారాయణకు టికెట్ దక్కింది. దీంతో రెబెల్గా బరిలోకి దిగిన కోరుకంటి కేవలం 2,229 ఓట్ల తేడాతోనే సత్యనారాయణపై ఓడిపోయాడు. కొంతకాలం టీఆర్ఎస్కు దూరంగా ఉన్న కోరుకంటి మళ్లీ పార్టీకి దగ్గరైనా ఈసారీ ఆశాభంగమే ఎదురైంది. మరోమారు రె'బెల్' మోగించి ప్రచారంలో దీటుగానే స్పందిస్తున్నారు.
పెద్దపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి పరిస్థితి 'అడకత్తెరలో పోకచెక్క'లా తయారైంది. గతంలో టీడీపీ నుంచి గట్టిపోటీనిచ్చిన ప్రత్యర్థి విజయరమణరావు ఇటీవలే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నా.. 'హస్తం'లో ఉన్న గ్రూపులు తనకు కలిసొస్తాయని ఆశిస్తున్నారు. అయినప్పటికీ సొంతగూటిలోనే మద్దతు దొరకడం లేదు. పెద్దపల్లి స్థానాన్ని బీసీలకే అప్పగించాలన్న గళం ఆ పార్టీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది. దానికితోడు టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఈదశంకర్రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్రావు అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. కనీసం ఎమ్మెల్మేకు మద్దతుగా ఏ ప్రచార కార్యక్రమంలోనూ దర్శనమివ్వడం లేదు. సొంతగూటిలోనే సహకారం అందక దాసరి గందరగోళంలో పడ్డారు.
మంథనిలో సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టమధుకూ రెబెల్స్ పోరు తప్పడం లేదు. మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి కొడుకు చందుపట్ల సునీల్రెడ్డి గత ఎన్నికల్లోనే టీఆర్ఎస్ టికెట్ ఆశించారు. ఆ సమయంలో భంగపడ్డ ఆయన రెబెల్గానే పోటీ చేశారు. అయినప్పటికీ పుట్టమధు, కాంగ్రెస్ మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మధ్యనే పోటీ నెలకొంది. పుట్ట మధుకు 84,037 ఓట్లురాగా.. శ్రీధర్బాబుకు 64,677 ఓట్లు పోలయ్యాయి. సునీల్రెడ్డి 6,550 ఓట్లతో తన ఉనికి చాటుకున్నారు. అనంతర పరిణామాల నేపథ్యంలో సునీల్రెడ్డి మంత్రి కేటీఆర్ సమక్షంలోనే టీఆర్ఎస్లో చేరారు. ఈసారీ టికెట్ను ఆశిస్తున్న ఆయన.. పుట్టకు దీటుగా ప్రచారంలో తలమునకలయ్యారు.
కేటీఆర్ అంతర్గతంగా ప్రోత్సహిస్తున్నారా..?
పెద్దపల్లి జిల్లాలో రెబెల్స్ను ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ అంతర్గతంగా ప్రోత్సహి స్తున్నారన్న ప్రచారం సాగుతోంది.
అందుకు మంథనిని ఉదహరించవచ్చు. అక్కడ పుట్టమధు పేరు ప్రకటించిన వారం రోజులకే సునీల్రెడ్డి, అతని అనుచరులు పెద్దఎత్తున నిరసన గళం వినిపించారు. సునీల్రెడ్డి హైదరాబాద్లోనే మకాం వేసి అధిష్టానం వద్ద మంతనాలు చేసినట్టు సమాచారం. అనంతరం మంథనికి వచ్చిన సునీల్రెడ్డి విలేకరుల సమావేశంలో తనకే టికెట్ వస్తుందని ప్రకటించారు. లేనిపక్షంలో రెబెల్గానైనా పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. ఏకంగా కేటీఆర్ వద్ద మాట తీసుకుని తన ప్రచారాన్ని వేగిరం చేసినట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. రామగుండంలో సిట్టింగ్ను మార్చాలని కోరుకంటి చందర్, జడ్పీటీసీ సంధ్య, మాజీ మేయర్ లక్ష్మినారాయణ, నాయకులు పెద్దంపేట శంకర్ మొదట్లోనే ఆందోళన చేశారు. అధిష్టానం వద్ద ఫిర్యాదులు చేసినా ఫలించలేదు. ఈ క్రమంలో కేటీఆర్ వారందరితో ప్రత్యేకంగా మాట్లాడి 'ముందైతే ప్రచారంలో ఉండండి' అని చెప్పినట్టు తెలిసింది. మేయర్పై అవిశ్వాసంలో పంతం నెగ్గించుకున్నందుకే సోమారపు మీద కేటీఆర్కు అసంతృప్తి వ్యక్తమైందని తెలుస్తున్నది. ఈ పరిణామాల నడుమ సీఎం కేసీఆర్ అభ్యర్థులను మార్చబోమని ప్రకటించినా.. జరుగుతున్న సమీకరణాలు సిట్టింగుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి.