Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమ్మినేని, నల్లా సూర్యప్రకాశ్
- బీఎల్ఎఫ్లో చేరిన కాంగ్రెస్ నేత సీఎం నర్సింహులు
నవతెలంగాణబ్యూరో -హైదరాబాద్
రాజకీయం అంటే ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజలకు సేవ చేయడమేనని, అలాంటి రాజకీయాల్లో నేడు కార్పొరేట్లు, పెట్టుబడిదారులు, దోపిడీదారులు చొరబడి రాజకీయం అంటే ప్రజలను దోచుకోవడం, దోపిడీలు, దొమ్మీలు కొనసాగించేలా మార్చారని బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం, చైర్మెన్ నల్లా సూర్య ప్రకాశ్ అన్నారు. గురువారం ఎస్వీకేలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్కుమార్ ముఖ్యఅనుచరుడు కాంగ్రెస్ నేత సీఎం నర్సింహులు నేతృత్వంలో వందలాది మంది బీఎల్ఎఫ్లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ నాలుగున్నరేండ్ల కాలంలో సామాజిక న్యాయం అట్టడుగున పడిపోయిందన్నారు. విద్య, వైద్యం పూర్తిగా కార్పొరేట్ శక్తుల కబంధ హస్తాల్లో చిక్కుకుందన్నారు. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే విద్య, వైద్యం, సక్రమంగా అందించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉంటుందని చెప్పారు. టీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ విద్యా, వైద్య రంగాలను పూర్తిగా విస్మరించిందన్నారు. ప్రజలు ఆశీర్వదించి బీఎల్ఎఫ్కు అవకాశం ఇస్తే విద్య, వైద్య రంగాలను పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తెస్తామన్నారు. తెలంగాణలో ఉన్న ప్రభుత్వ, దేవాదాయ, అటవీ భూములను లక్షలాది ఎకరాల భూమిని భూబకాసులు అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆరోపించారు. వారి అక్రమ చెర నుంచి ఆ భూమిని విడిపించి ప్రతి పేద కుటుంబానికి మూడెకరాల ఎకరాల చొప్పున పంపిణీ చేయొచ్చన్నారు. ఆ సత్తా బీఎల్ఎఫ్కు తప్ప ఏ ఇతర రాజకీయ శక్తులకు లేదన్నారు. అలాంటి ప్రగల్భాలు పలికిన కేసీఆర్ నాలుగున్నర ఏండ్లలో పట్టుమని రూ 10వేలు కూడా పూర్తి చేయలేకపోయారని, పేదలంటే కేసీఆర్కు అంత చులకన భావం అన్నారు. రాష్ట్రంలో రెండున్నర లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఎల్ఎఫ్ అధికారంలోకి వస్తే రెండున్నర ఉద్యోగాలను భర్తీ చేయడమే కాకుండా అదనంగా బహుజన బువ్వ క్యాంటీన్ల ద్వారా మరో లక్ష ఉద్యోగాలు సృష్టించి కనీస వేతనం రూ 18వేలు ఇస్తామని తెలిపారు. రైతులకిచ్చే రుణమాఫీ, పెట్టుబడి సాయంతో వ్యవసాయ రంగం బాగుపడదని, మార్కెట్లో మధ్య దళారీ వ్యవస్థను నిర్మూలించి, రైతు పండించిన ప్రతి పంటకు పెట్టుబడి ఖర్చులో 50 శాతం అదనంగా గిట్టుబాటు ధర కల్పించడం ద్వారానే రైతులు బాగుపడుతారని చెప్పారు. బీఎల్ఎఫ్ రాష్ట్ర నేత జాన్వెస్లీ మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని కొనసాగించడానికే బీఎల్ఎఫ్ ఆవిర్భవించిందని, అన్ని ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనార్టీ, సామాజిక, ప్రజా సంఘాలు దీనికి మద్దతు నిస్తుందన్నారు. అందుకే దీన్ని బహుజనులంతా బీఎల్ఎఫ్ను బలపర్చాలని కోరారు. 72 ఏండ్లలో అగ్రకులాల నాయకత్వంలో బహుజనుల బతుకుల్లో ఎలాంటి మార్పులు రాలేదని, బహుజన రాజ్యాధికారం ద్వారానే బహుజనుల బతుకుల్లో మార్పులు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మన్నారం నాగరాజు, చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ డాక్టర్ సామ సత్యనందన్, రాష్ట్ర నాయకులు బి వెంకట్, మల్లేష్, జంగారెడ్డి, గుర్రాల సంతోష్రెడ్డి, నర్సింహులు, మహిపాల్, జగన్ తదితరులు ఉన్నారు.