Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సరోత్తంరెడ్డి, జనార్ధన్రెడ్డి, పూల రవీందర్ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఏకాభిప్రాయంతోనే ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశామని పీఆర్టీయూటీఎస్ ప్రకటించింది. నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ పూల రవీందర్, కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి కూర రఘోత్తంరెడ్డి పోటీ చేస్తారని వెల్లడించింది. సోమవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీలు కె జనార్ధన్రెడ్డి, పూల రవీందర్, పీఆర్టీయూటీఎస్ అధ్యక్షుడు పి సరోత్తంరెడ్డి మాట్లాడుతూ గతనెల 30న పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర కౌన్సిల్ తీర్మానం మేరకు అధికారికంగా అభ్యర్థులను ప్రకటించామని చెప్పారు. పీఆర్టీయూలో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం ఆశించిన వారు చాలా మంది ఉన్నారని అన్నారు. 23 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో సంప్రదించిన తర్వాత ఏకాభిన్రపాయంతో పూల రవీందర్, రఘోత్తంరెడ్డిలను ఎంపిక చేశామన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అర్హులైన వారు ఎన్రోల్మెంట్ చేసుకుంటున్నారని చెప్పారు. పీఆర్టీయూటీఎస్లో ఎమ్మెల్సీ చిచ్చు ఉందన్న వదంతులు నమ్మొద్దని కోరారు. సీపీఎస్ రద్దు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఏకీకృత సర్వీస్ రూల్స్కు సంబంధించి సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశామని చెప్పారు. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చేలా లేదంటే రాష్ట్రపతి సవరణ ఉత్తర్వులు వచ్చేలా ప్రయత్నిస్తామన్నారు. కొత్త ప్రభుత్వంలో మంచి ఫిట్మెంట్ ఇప్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూటీఎస్ ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు పాల్గొన్నారు.