Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
అప్పుల బాధతో మహిళా కౌలురైతు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలం బండారుపల్లిలో జరిగింది. ములుగు ఏఎస్ఐ లలిత తెలిపిన వివరాల ప్రకారం.. గూడెపు సమ్మక్క(40) అదే గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద ఎకరన్నర పొలాన్ని కౌలుకు తీసుకుని వరి సాగు చేసింది. వర్షాలు లేక, నీరందక పైరు ఎండిపోయింది. దీనికి తోడు గతేడాది కూడా సరిగా పంటలు పండక సుమారు లక్ష రూపాయల మేర అప్పులు అయ్యాయి. ఈ యేడాది కూడా దిగుబడి రాకపోవడంతో అప్పులు తీర్చే మార్గం లేక సమ్మక్క ఆదివారం పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు వెంటనే ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తీసుకుపోయారు. పరిస్థితి విషమించి సోమవారం తెల్లవారుజామున మృతిచెందింది. సమ్మక్క భర్త కొన్నేండ్ల కిందట అనారోగ్యంతో మృతిచెందాడు. కుమారుడు రాకేష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.