Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాస్ పుస్తకాల్లో తప్పులు సరిచేయాలి :
- తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా
నవతెలంగాణ- గణపురం
పాస్ పుస్తకాల్లో తక్కువ భూమి ఎక్కించారని, కొంతమందికి అసలు పుస్తకాలే ఇవ్వలేదని, దీంతో రైతు బంధు పథకం వర్తించలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని జయశంకర్ జిల్లా గణపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. నాలుగు ఎకరాలున్న రైతుకు ఎకరం మాత్రమే పుస్తకాల్లో ఎక్కించారని, చాలా మంది రైతులకు అసలు పాస్ పుస్తకాలే ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా పట్టించుకోవడం లేదన్నారు. దీంతో రైతుబంధు డబ్బులు మొదట విడత రాలేదని, ఇప్పుడు రెండో విడత కూడా వచ్చే పరిస్థితి లేదని అన్నారు. రెవెన్యూ సిబ్బందికి డబ్బులు కూడా ఇచ్చామని, అయినా మళ్లీ డబ్బుల కోసం పని చేయడానికి సతాయిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల షెడ్యూల్ వల్ల బిజీగా ఉన్నామని, కొంత ఆలస్యమైనా అందరికీ తప్పకుండా పాస్పుస్తకాలు ఇస్తామని, తప్పులుంటే సరిచేస్తామని తహసీల్దార్ సమ్మయ్య హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.