Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాంకేతిక విద్యాశాఖ జేడీకి ఎస్ఎఫ్ఐ, డీఎస్ఎఫ్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పాలిటెక్నిక్ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని ఎస్ఎఫ్ఐ, డీఎస్ఎఫ్ డిమాండ్ చేశాయి. పరీక్షలను వాయిదా కోరుతూ పలువురు విద్యార్థులతో కలిసి సాంకేతిక విద్యాశాఖ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం సాంకేతిక విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ యూవీఎస్ఎన్ మూర్తిని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎం తిరుపతి, డీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జగన్ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. పాలిటెక్నిక్ సిలబస్ పూర్తికాకుండానే అధికారులు పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడం సరికాదని ఓ ప్రకటనలో తెలిపారు. ఒకేరోజు ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించడంతో సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకు నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పరీక్షలు వాయిదా వేయాలని కోరిన విద్యార్థులను క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, ప్రవేశం రద్దవుతుందని అధికారులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని తెలిపారు. అధికారులు ఇలాంటి పద్ధతిని మార్చుకోవాలని కోరారు. పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా చేసే సమయంలో అధికారులు, విద్యార్థి సంఘ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకొని శాంతింపచేయడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి విజేత, నగర అధ్యక్షుడు అశోక్రెడ్డి, డీఎస్ఎఫ్ నేతలు అమర్, నరేష్ నాయక్, ఎన్ఎస్యూఐ నాయకులు అరుణ్రెడ్డి, హరి, భరత్, జేఎన్టీయూ జేఏసీ నేతలు మల్లిఖార్జున్రెడ్డి, రాజు, నరేష్ పాల్గొన్నారు.