Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అనునిత్యం మహిళల గురించి మాట్లాడే బీజేపీ నేతలు... కేవలం తమ మాటల్లోనే వారిని గౌరవిస్తున్నారని ఐద్వా అఖిల భారత ప్రధాన కార్యదర్శి మరియం ధావలె అన్నారు. మోడీ హయాంలో దేశంలో మహిళలపై నానాటికీ అఘాయిత్యాలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వారికి బీజేపీ నేతలు బాహాటంగా మద్దతు పలకటంపట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. శబరిమల విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు.. మహిళా హక్కులను కాపాడేదిగా.. వారి గౌరవాన్ని పెంచేదిగా ఉందని అన్నారు. ఈ తీర్పును అమలు చేయొద్దంటూ కొనసాగుతున్న ఆందోళనల వెనుక బీజేపీ, ఆరెస్సెస్ కుట్ర దాగుందని ఆమె విమర్శించారు.
'మనువాదుల పాలనలో కాలరాయబడుతున్న మహిళా హక్కులు...' అనే అంశంపై సోమవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ధావలె ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. ఉజ్వల పథకంలో భాగంగా నిరుపేద మహిళలకు ఉచితంగా గ్యాస్ పంపిణీ చేస్తామంటూ చెప్పిన మోడీ.. ఆ తర్వాతి కాలంలో గ్యాస్ ధరను విపరీతంగా పెంచారని చెప్పారు. ఇది సామాన్య ప్రజలపై పెనుభారాన్ని మోపిందని తెలిపారు. ప్రతి రోజూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం వంటింటిపైనా పడుతున్నదని చెప్పారు. ఫలితంగా కూరగాయలు, పాలు, ఇతర నిత్యావసరాల ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. ఇటీవల సుప్రీం కోర్టు వెలువరించిన పలు తీర్పులు మహిళల ఆత్మగౌరవాన్ని పెంచేవిగా ఉన్నాయని తెలిపారు. వీటికి సంబంధించి బీజేపీ నేతలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మహారాష్ట్రలో శని సింఘణాపూర్ దేవాలయంలోకి మహిళలను అనుమతించాలన్న సుప్రీం తీర్పును అక్కడి బీజేపీ సర్కారు అమలు చేస్తున్నదని గుర్తుచేశారు. కానీ అదే సుప్రీం శబరిమల విషయంలో వెలువరించిన తీర్పును అమలు చేయొద్దంటూ బీజేపీ, ఆరెస్సెస్ వాదించటం విడ్డూరంగా ఉందని అన్నారు. మత విశ్వాసాల గురించి పదే పదే చెబుతున్న హిందూత్వ వాదులు.. త్రిపుల్ తలాక్ విషయంలో ఏకంగా ఓ ఆర్డినెన్స్నే తెచ్చారు కదా..? అని ప్రశ్నించారు. అలాంటప్పుడు శబరిమల విషయంలో సుప్రీం తీర్పును ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి బీజేపీ, ఆరెస్సెస్ కుతంత్రాలను ఎప్పటికప్పుడు మహిళలకు వివరించాలని... తద్వారా ఆయా శక్తుల కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఐద్వా జాతీయ నాయకులు టి.జ్యోతి మాట్లాడుతూ.. మహిళలను గడప దాట నీయని స్థితి నుంచి పలు చట్టాలను రూపొం దించేంత వరకూ మహిళలు అనేక పోరాటాలు నిర్వహించి విజయం సాధించారని తెలిపారు. ఇప్పుడు అవే చట్టాలు, హక్కులు, స్వేచ్ఛ, సమాన త్వానికి తూట్లు పొడిచేందుకు పాలకులు ప్రయత్ని స్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటిత ఉద్యమాల ద్వారా వీటిని వెనక్కు కొట్టాలని కోరారు. కార్యక్రమంలో ఐద్వా సీనియర్ నేతలు హైమవతి, ఆశాలత, ఇందిర తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి ఐద్వా కేంద్ర కమిటీ సమావేశాలు
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) కేంద్ర కమిటీ సమావేశాలు మంగళవారం హైదరాబాద్లో ప్రారంభం కానున్నాయి. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశాలకు ఐద్వా జాతీయ నాయకులు సుభాషిణీ అలీ, అఖిల భారత అధ్యక్ష, కార్యదర్శులు మాలినీ భట్టాచార్య, మరియం దావలే ముఖ్య అతిథులుగా హాజరువుతున్నారు. వీరితోపాటు హర్యానా నుంచి జగ్మతి సంగ్మాన్ (కుల దురహంకార హత్యలపై పోరాటం), తమిళనాడు నుంచి వాసుకి (మీడియాలో మహిళల పాత్ర, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం), కర్నాటక నుంచి నీల (ఉపాధి హామీ చట్టం కోసం పోరాటం), హిమాచల్ ప్రదేశ్ నుంచి సంతోషి (భూ పోరాటం), ఢిల్లీ నుంచి కీర్తీ సింగ్ (లీగల్ అఫైర్స్), ఢిల్లీ నుంచి అర్చనా ప్రసాద్ (గిరిజన మహిళలు), కేరళ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ జోసఫిన్ తదితరులు సమావేశాలకు హాజరవుతున్నారని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి తెలిపారు. వీరుగాక 20 రాష్ట్రాల నుంచి కేంద్ర కమిటీ సభ్యులు హాజరవుతారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.