Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని గిరిజన తండాల్లో ఎన్నికల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కోరింది. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు వల్ల గిరిజనులు తమ ఓటు హక్కును సంపూర్ణంగా వినియోగించుకునే అవకాశం ఉందని పేర్కొంది. తండాల్లో పోలింగ్ కేంద్రాలు లేకపోవడం వల్ల దూర ప్రాంతాలకు వెళ్లి ఓటు వేయాల్సి వస్తోందని తెలిపింది. సోమవారం సచివాలయంలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం ధర్మనాయక్, టీమాస్ స్టీరింగ్ కమిటీ సభ్యులు ఆర్ శ్రీరాంనాయక్, రాష్ట్ర కమిటీ సభ్యులు కె శంకర్ బృందం కలిసి వినతిపత్రం సమర్పించింది. తెలంగాణలోప్రభుత్వం గుర్తించిన గ్రామపంచాయతీలు 12741 కాగా, అందులో 2637 గిరిజన ఏజెన్నీ,మైదాన గ్రామపంచాయతీలు ఉన్నాయని ధర్మనాయక్ వివరించారు. ఈ పంచాయతీలకు అనుసంధానం చేస్తూ 4,127 తండాలను ప్రభుత్వం గుర్తించిందన్నారు. దాదాపు 13వేల తండాలు ఉన్నాయని, వీటిలో ఎన్నికల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి గిరిజనులు తమ ఓట్లను వినియోగించుకునేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో 32 గిరిజన తెగల్లో 36 లక్షల జనాభా ఉందన్నారు. నేటికీ గ్రామాలకు దూరంగా ఉండి, పోలింగ్ కేంద్రాలు లేక ఎంతో మంది గిరిజనులు తమ ఓటు వినియోగించుకునే పరిస్థితి లేదన్నారు. తండాలకు రోడ్లు, బస్సులు లేక రవాణా సౌకర్యం తక్కువగా ఉందన్నారు. ఓట్లు వేయాలంటే ముసలివాళ్ళు, వికలాంగులు, చిన్న పిల్లల తల్లులు, రోగులు తండా నుంచి 2 లేక 5 కిమీలు నడిచి వచ్చి, క్యూలో నిలబడి ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర నీళ్లు, భోజన వసతి ఉండదని, ఇలా అనేక సమస్యలతో తండా నుంచి రాలేదని పరిస్థితి ఉందన్నారు. ఈ క్రమంలో గిరిజన తండాలకు ఎన్నికల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి 2018 డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో గిరిజనులు తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించి, గిరిజనులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.