Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుమోటోగా పిల్
- నిందితులతో అధికారులు కుమ్మక్కయ్యారా : హైకోర్టు ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బాలికలను వ్యభిచారంలోకి దింపిన యాదగిరిగుట్ట ఘటనపై హైకోర్టు స్పందించింది. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తుందో లేదో తెలియజేయాలి.. అని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అవసరమైతే ప్రత్యేక కోర్టును నెలకొల్పుతామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పిల్లల కిడ్నాప్, మాయమాటలతో, అపహరణ తదితర మార్గాల్లో బాలికలను వ్యభిచార వృత్తిలోకి దించిన ఘటనపై ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనానికి హైకోర్టు స్పందించింది. ఈ వార్తలను చదివిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రజాప్రయోజన వ్యాజ్యంగా (పిల్) రిజిష్టర్ చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని గతంలో ఆదేశించింది. సోమవారం ఆ పిల్ను ప్రధాన న్యాయమూర్తి టిబీ రాధాకృష్ణన్, న్యాయమూర్తి ఎస్.వి. భట్లతో కూడిన ధర్మాసనం విచారణ ప్రారంభించింది. బాలికలు యుక్త వయసు వారిలా కనబడేలా వారికి హార్మోన్లు, మందులు ఇస్తారా, బ్రాయిలర్ కోళ్లలా ఆడ పిల్లల్ని పరిగణిస్తారా.. హార్మోన్ల ఇంజెక్షన్లు ఇచ్చిన డాక్టర్లపై ఉద్ధేశపూర్వక కుట్ర కింద పోలీసులు ఎందుకు కేసు పెట్టలేదు..అని హైకోర్టు నిలదీసింది. దీనిని లోతుగా పరిశీలిస్తే నిందితులతో అధికారులు కుమ్మక్కు అయ్యారనిపిస్తోందని అభిప్రాయపడింది. ఇలాంటి ముఠాలోని నిందితులకు, హార్మోన్ల ఇంజెక్షన్లు చేసిన డాక్టర్లకు కింది కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై డివిజన్ బెంచ్ ఆశ్చర్యాన్ని వెలిబుచ్చింది. కింది కోర్టు బెంచ్ ఇవ్వకుండా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎందుకు గట్టిగా అడ్డుకోలేదో అర్ధం కావడం లేదని, నిజంగానే పీపీ అడ్డుకున్న తర్వాత కూడా కోర్టు బెయిల్ ఇచ్చిందా వంటి వివరాలు అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పరిహారం ఇస్తే పాపం పోతుందా?
తెలంగాణ సర్కార్ తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదిస్తూ.. ఈ దారుణం గురించి తెలిసిన వెంటనే పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టామన్నారు. వాదనల మధ్యలో అదనపు ఏజీ రామచందర్రావు కల్పించుకుని బాధితులకు పరిహారం చెల్లించామన్నారు. వెంటనే బెంచ్ కల్పించుకుని.. ఆడుతూ పాడుతూ ఉండాల్సిన బాలికలు వ్యభిచార రొంపిలోకి వెళ్లిపోయారని, వారికి ఏం పరిహారం ఇస్తే న్యాయం చేసినట్టు అవుతుందని ప్రశ్నించింది. పిల్లలతో వ్యభిచారం చేయిస్తున్న విషయం ఆ ఇండ్ల చుట్టపక్కల వారికి కూడా తెలియదని అదనపు ఏజీ చెప్పగా, మానవత్వంతో ముడిపడిన ఇలాంటి కేసుల్లో ప్రభుత్వ నిఘా వైఫల్యాన్ని సమర్ధించుకోవడం ఎంతమాత్రం సమర్ధనీయం కాదని బెంచ్ వ్యాఖ్యానించింది. బాలికలతో పడుపు వృత్తి చేయించడంపై పత్రికల్లో కథనాలు రావడంపై అదనపు ఏజీ అసంతృప్తి వెలిబుచ్చగా.. పత్రికల్లో కథనాల్లో వాస్తవం లేకపోలేదని, పత్రికల్లో వార్తలు వచ్చాక జిల్లా జడ్జి నుంచి తాము నివేదిక తెప్పించుకున్నాకే ఈ వ్యవహారాన్ని పిల్గా పరిగణించామని డివిజన్ బెంచ్ గట్టిగా చెప్పింది. ప్రభుత్వం మహిళా పోలీసులు ఉన్న సిట్ టీంను ఏర్పాటు చేస్తుందో లేదో చెప్పాలని, మంగళవారం జరిగే విచారణకు పూర్తి వివరాలు తమకు అందజేయాలని, విచారణకు యాదగిరిగుట్ట డీఎస్పీ స్వయంగా హైకోర్టు విచారణకు హాజరుకావాలని డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది.