Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బస్భవన్ వద్ద రిటైర్డ్ ఉద్యోగుల ధర్నా
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
ఆర్టీసీలో డబ్బు లేదన్న కారణంగా సెటిల్ మెంట్ బకాయిలను చెల్లించ కపోవడంతో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు తెలిపారు. వెంటనే రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సోమవారం బస్భవన్ వద్ద ఆర్టీసీ ఈయూ ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా రిటైర్డ్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె భాస్కరరావు మాట్లాడుతూ సకల జనుల సమ్మెలో పాల్గొని రిటైర్డు అయినా కార్మికులకు, చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు సకల జనుల సమ్మె వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు అతి తక్కువ పెన్షన్ విధానం అమలవుతుండటంతో అనేక ఇబ్బం దులు పడుతున్నారని చెప్పారు. ఆర్టీసీలో రిటైర్డ్ ఉద్యోగులకు వృద్ధాప్య పెన్షన్ సౌకర్యం కల్గించాలని డిమాండ్ చేశారు. అనారోగ్య కారణాలతో ఇబ్బందులు పడుతున్న వారికి ఆరోగ్యశ్రీ పధకం ద్వారా వైద్య సాయం అందించాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులలో చాలా మందికి ఇండ్లు లేకపోవడం వల్ల ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను తమకు కేటాయించాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగులకు బస్పాస్, ఐడెంటిటీ కార్డుపై ప్రయాణం చేసే అవకాశం ఉండేదని, రాష్ట్ర విభజన తర్వాత ఈ సౌకర్యం మేనేజ్మెంట్ తీసివేయడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వెంటనే బస్పాస్ సౌకర్యం పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పిహెచ్ రాంచందర్, వి మురళీధర్రావు, పిఆర్కె రెడ్డి, ఎస్ చంద్రమౌళి, ఆర్ యాదయ్య, ఎం యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఇదే సమస్యలపై ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రాజిరెడ్డి ఎండీకి వినతిపత్రం సమర్పించారు.