Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రలోభాలకు లోను కావద్దు
- ఎస్ఆర్ శంకరన్ ప్రజల అధికారి :
- జయంతి సభలో అనితా రాజేంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విలువలు, నిజాయితీ, పట్టుదల, సేవాదృక్పథం, పేద ప్రజల సమస్యల పరిష్కారం పట్ల అంకితభావం ఉంటేనే ఉన్నతమైన వ్యక్తిత్వం ఉంటుందని ఐఏఎస్ అధికారి, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ అనితా రాజేంద్రన్, తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. ఎస్ఆర్ శంకరన్ విలువలు, నిజాయితీకి ప్రతిరూపమని ఆయన సేవలను కీర్తించారు. సోమవారం హైదరాబాద్లోని ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమి ఆధ్వర్యంలో ఎస్ఆర్ శంకరన్ 84వ జయంతి వేడుకలు జరిగాయి. శంకరన్ చిత్రపటానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అనితా రాజేంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ వివిధ అంశాలపై విజ్ఞానంతోపాటు నైతిక విలువలు, నిజమైన సమస్యల పట్ల అవగాహన ఉన్నోళ్లకే సివిల్ సర్వీసెస్ సాధించేందుకు ఎక్కువ అవకాశాలుంటాయని చెప్పారు. విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఆ వ్యక్తిత్వమే ఉన్నతస్థాయికి తీసుకెళ్తుందని అన్నారు. మదర్ థెరిస్సా, అబ్దుల్ కలాం, ఎస్ఆర్ శంకరన్, అంబేద్కర్ వంటి మహనీయుల జీవిత చరిత్రలను చదవాలని సూచించారు. వారి జీవితం అందరికీ ఆదర్శమని అన్నారు. ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అధికారి మాత్రమే కాదని ప్రజల మనిషి అని కొనియాడారు. పేదల సమస్యలపై అంకితభావంతో పనిచేశారని అన్నారు. రాజకీయ నాయకులు, ఇతరుల ప్రలోభాలకు అధికారులు లోను కావొద్దని కోరారు. ప్రలోభాలకు లోనైతే వ్యక్తిత్వం దెబ్బతింటుందని చెప్పారు. విలువల్లేకుండా ఎంత డబ్బు సంపాదించినా ప్రయోజనముండబోదని అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో అధికారులు పనిచేయాలని సూచించారు. రాజ్యాంగం, చట్టాల వల్ల ప్రజలకు కొంత వరకే మేలు జరుగుతాయని చెప్పారు. అవినీతి నిర్మూలన, బాల్యవివాహాలు నిర్మూలన, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, వరకట్న నిషేధ చట్టం వంటివి ఉన్నా కొంత వరకే అమలవుతున్నాయని అన్నారు. పేదలకు న్యాయం చేయాలన్న వ్యక్తిత్వముంటే సమస్యలతో వచ్చే వారికి న్యాయం చేసే అవకాశముంటుందని చెప్పారు. ఆధునిక సమాజంలోనూ కులవివక్ష ఉందన్నారు. అయినా భారతీయులంతా సమానమేనని ప్రతిజ్ఞ చేస్తున్నామని అన్నారు. కష్టపడి చదవాలని, అనుకున్నది సాధించాలని, ఉన్నత విలువలతో వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అంతకుముందు మహాత్మాజ్యోతిబాఫూలే, సావిత్రిబాయి ఫూలే చిత్రపటాలకు అనితా రాజేంద్ర పూలమాలవేసి నివాళులర్పించారు. ఎపిజె అబ్దుల్కలాం పేరుతో ఉన్న లైబ్రరీని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ స్టడీ హాల్ను ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమి చీఫ్ గార్డెనర్ వై సత్యనారాయణ, మదర్ థెరిస్సా స్టడీహాల్ను అకాడమి చైర్మెన్ నంద్యాల నర్సింహ్మారెడ్డి, భగత్సింగ్ హాల్ను అకాడమి ప్రిన్సిపాల్ కె సురేందర్రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అకాడమి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కె సతీష్కుమార్, ఫ్యాకల్టీ ఎమన్యూయేల్ సందీప్, మన్నే జగన్నాధ్, ప్రభాకర్చౌటి, సైదేశ్వర్రావు, పి శివకుమార్, పి ప్రభాకర్, ఎం జ్యోతి, ఎన్ అనురాధ తదితరులు పాల్గొన్నారు.