Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.సాయిబాబు
నవతెలంగాణ-గోదావరిఖని
కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చి సీఎం కేసీఆర్ మోసం చేశారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.సాయిబాబు విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఎన్టీపీసీ గేట్ -2 వద్ద సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఎల్ఎఫ్ బలపరిచిన రామగుండం నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి బుర్ర తిరుపతిని గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల్లో కార్మికులకు అండగా నిలిచే సీఐటీయూ జిల్లా అధ్యక్షుడిగా బుర్ర తిరుపతి ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. కార్మిక వర్గంపై ఉన్న భరోసాతోనే తిరుపతిని నిలబెట్టినట్టు చెప్పారు. సమాన పనికి సమాన వేతనం, సుప్రీం కోర్టుతీర్పు అమలు చేయకుండా ప్రభుత్వాలు యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ ఉత్పత్తి మొత్తం కాంట్రాక్టు కార్మికుల శ్రమపైనే ఆధారపడిందన్న సంగతి పాలకులకు తెలియదా?అని ప్రశ్నించారు. ఈ నియోజక వర్గంలో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు చేసిన అభివృద్ధి ఏమాత్రమూ లేదన్నారు. ఈ సారి సీపీఐ(ఎం) అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి బుర్ర తిరుపతి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వై.యాకయ్య, ఎం.రామాచారి, వేల్పుల కుమారస్వామి, ఎన్.శంకర్, గెల్లు లక్ష్మారెడ్డి, ఎస్.రవీందర్ పాల్గొన్నారు.