Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆధునిక భారతదేశంలో వివక్షను చూపిన తీరుకు ప్రశంస
హైదరాబాద్: అంటరానితనం, వివక్షలు నెలకొన్న ఆధునిక భారత దేశాన్ని ఆవిష్కరించిన 'యాంట్స్ ఎమాంగ్ ఎలిఫెంట్స్' పుస్తకం ప్రతిష్టాత్మకమైన 'శక్తిభట్ ఫస్ట్బుక్-2018' పురస్కారానికి ఎంపికైంది. కాజిపేటకు చెందిన రచయిత సుజాత గిడ్ల ఈ పుస్తకాన్ని రచించారు. ఒక సాధారణ దళిత కుటుంబంలో జన్మించిన ఆమె, భౌతికశాస్త్రంలో పీజీ పూర్తిచేశారు. ఐఐటీ-మద్రాస్లో భౌతిక శాస్త్రం పరిశోధకురాలిగా పని చేశారు. ప్రస్తుతం ఆమె న్యూయార్క్ 'సబ్వే సిస్టం' విభాగంలో పనిచేస్తున్నారు. అవార్డు కోసం ఆరు పుస్తకాలను తుది జాబితాకు నిర్వాహకులు ఎంపిక చేశారు. తుది జాబితా నుంచి సుజాత రచించిన పుస్తకాన్ని ముగ్గురు న్యాయనిర్ణేతల బృందం ఎంపిక చేసింది. ఈ అవార్డును శక్తి భట్ ఫౌండేషన్ వారు 2008 నుంచి అందజేస్తున్నారు. విజేతలకు రెండు లక్షల రూపాయలు నగదును ప్రదానం చేస్తారు.
'యాంట్స్ ఎమాంగ్ ఎలిఫెంట్స్' పుస్తకంలో వ్యక్తమైన పేదరికం, అంటరానితనం, పితృస్వామ్య వ్యవస్థ, తిరుగుబాటు, కమ్యూనిజం వంటి అంశాలు పాఠకులను ఆలోచింప చేసింది. ఆధునిక భారతదేశంలో దళితుల జీవన స్థితిగతులు కండ్లకు కట్టినట్టు చూపించారు. ఆమె పుస్తకంలో సహజత్వం ఉట్టిపడతోందని న్యాయనిర్ణేతలన్నారు. పేదరికం, అసమానతలను గురించి పుస్తకంలో రచయిత్రి పేర్కొన్న తీరు, ఎన్నో పాఠాలు నేర్పుతుందని, కొత్త విషయాల్ని తెలుపుతోందని వారు చెప్పారు. పుస్తకం చదువుతున్నప్పుడు పాఠకుల్లో ఎన్నో ఆలోచనల్ని కలిగించిందని, అందుకే ఈ పుస్తకానికి ఈ ఏడాది శక్తిభట్ అవార్డుకు ఎంపిక చేస్తున్నామని న్యాయనిర్ణేతలు తెలిపారు.