Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేం దుకు కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రానికి చేరుకుంది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ నేతృత్వంలోని 11 మంది సభ్యుల బృందం మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. సోమవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రాయానికి చేరుకున్న బృందం ముందుగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్కుమార్తో సమావేశమైంది. అనంతరం అక్కడి నుంచి నేరుగా హోటల్ తాజ్ కృష్ణాకు చేరుకుని ఎన్నికల నిర్వహణకు సంబంధించి గుర్తింపు పొం దిన తొమ్మిది రాజకీయ పార్టీలతో భేటీ అయ్యింది. రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాల ని, నగదు, మద్యం పంపిణీకి అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేశాయి. దాంతో పాటే ఎన్నికల నిర్వహణకు సంబంధించి అభ్యంతరాలు, సుచనలు, సలహాలు అందజేశారు. ఈ భేటీలో నంద్యాల నర్సింహారెడ్డి, జె వెంకటేశ్ సీపీఐ(ఎం), చాడ వెంకటరెడ్డి సీపీఐ, తక్కలపల్లి శ్రీనివాస్, ఇంద్రసేనా రెడ్డి, థామస్ బాలసుబ్రమణ్యం (బీజేపీ), సిద్ధార్థఫూలే, ఎల్లన్న (బీఎస్పీ), వినోద్, శ్రీనివాస్రెడ్డి (టీఆర్ఎస్) రావుల చంద్రశేఖరెడ్డి (టీడీపీ) సంజీవరావు, రవికుమార్ (వైసీపీ), మహ్మద్జాఫ్రి, ముస్తాక్ (ఎంఐఎం) మర్రి శశిధర్ రెడ్డి (కాంగ్రెస్) కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్ను కలిసి ఎన్నికల నిర్వహణకు సంబంధించి తమ పార్టీల అభిప్రాయాలు, అభ్యంతరాలు, అభ్యంతరాలు, సూచనలను అందజేశారు.
తాండాల్లో పోలింగ్ బూత్ల ఏర్పాటు- సీపీఐ(ఎం)
గిరిజన తండాల్లో పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) నేతలు నంద్యాల నర్సింహారెడ్డి, జె వెంకటేశ్ కేంద్ర ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో గిరిజన ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో ఉన్న గ్రామ పంచాయితీలను అనుసంధానం చేస్తూ కొత్తగా4,127 తండాలను రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీలుగా గుర్తించిందని చెప్పారు. అంతేగాకుండా రాష్ట్రంలో 13వేల తండాలు ఉన్నాయని, ఇందులోని 32 గిరిజన తెగల్లో 36లక్షల మంది ఉన్నారని అక్కడ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
అలాగే ప్రచారం కోసం వినియోగించే వాహనాల నెంబర్లు ఇవ్వడం సాధ్యం కాదని, ఈ నిబంధనలను తొలగించాలని కోరారు. బహిరంగ సభల అనుమతి కోసం సింగిల్విండో విధానాన్ని ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని యాకుత్పురా నియోజకవర్గంలో ఒకే ఇంటి నెంబర్, ఒకే ఫోటోతో ఇద్దరు, ముగ్గురు పేర్లు ఉన్నాయని, వాటిని సరి చేయాలని సూచించారు. బైక్ రాలీ నిర్వహణ కోసం అన్ని ద్విచక్ర వాహనాల నెంబర్లు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనలు పెట్టడం సరికాదని, దాన్ని తొలగించాలని కోరారు.
ప్రజాస్వామ్యం ఖూనీ - కాంగ్రెస్
ఓటర్ల జాబితాను సవరించకుండా ఎన్నికలు నిర్వహి స్తే ప్రజాస్వామాన్ని ఖూనీ చేసినట్టేనని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి ఎన్నికల కమిషన్కు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో తప్పుడు వాదనలు వినిపించినందునే ఓటర్ల జాబితాకు కోర్టు అనుమతించిందని, వాస్తవాలను తెలుసుకోవడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఫిర్యాదు చేశారు.
60 లక్షల ఓట్లు గల్లంతైనట్టు ఈసీ దృష్టికి తీసుకువెళ్లిన ఎలాంటి చర్యలు తీసుకోలేద న్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎన్నికల కమిషనర్ భన్వర్లాల్ను తన ఇంటికి పిలిపించుకోని 15లక్షల ఓటర్ల పేర్లను తొలగించారని తెలిపారు. హైదరాబాద్లోని వాస్తవ పరిస్థితులను సీఈసీకి నివేదిక రూపంలో అందించారు.
తిరిగి అదే జాబితా విడుదల - బీజేపీ
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముసాయిదా జాబితానే తుది జాబితాగా ప్రకటించి విడుదల చేసిందని బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి తెలిపారు. బోగస్ ఓట్లను తొలగించాలని విజ్ఞప్తి చేసినా రాష్ట్ర ఎన్నికల కమిషన్ పట్టించుకోలేద న్నారు.తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా, ఓటర్ల జాబితాలో సవరణలు చేపట్టకుండానే తుది జాబితా విడుదల చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సున్నిత మైన ప్రాంతాల్లో సీసీ కెమరాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
బాధ్యులపై చర్యలు తీసుకోండి - సీపీఐ
ఓటర్ల జాబితాలో బోగస్ ఓటర్లను చేర్చిన ఎన్నికల అధికారులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా ఎన్నికలు స్వేచ్చగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అధికార పార్టీ నేతలు తమ పార్టీ అభ్యర్థులకు కోట్ల రూపాయలు చేరవేస్తున్నారని, నగదు, మద్యం రవాణాపై గట్టి నిఘా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో నగదుతో పట్టుబడ్డ వారికి శిక్షలు విధించాలని సూచించారు.
మా పార్టీ నేతలను ఇబ్బందికి గురి చేస్తున్నారు -టీడీపీ
తమ పార్టీ నేతలను ఆపద్ధర్మ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నదని టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖరెడ్డి తెలిపారు. కొందరు వ్యక్తులు తమను టార్గెట్ చేశారని చెప్పారు. తమ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తమ ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని తెలిపారు. పాతబస్తీలో పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారని ఫిర్యాదు చేశారు.
ఎన్నికల ఏర్పాట్లు భేష్ - టీఆర్ఎస్
రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని టీఆర్ఎస్ నేత వినోద్ చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుందన్నారు. నగదు, మద్యం రవాణా చేయకుండా గట్టి చర్యలు తీసుకుందని తెలిపారు.
మద్యం నిషేదం విధించాలి - బీఎస్పీ
రాష్ట్రంలో ఎన్నికలు ముగిసేంతవరకు మద్యం నిషేదం విధించాలని బీఎస్పీ నేత సిద్ధార్థ ఫూలే విజ్ఞప్తి చేశారు. నగదు ప్రవాహం మొదలైందని, డబ్బులతో ఓట్లు కొనడానికి కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు.