Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాజకీయ పార్టీలు ప్రకటించే మ్యానిఫెస్టోల్లో విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) డిమాండ్ చేసింది. ఈ మేరకు డీటీఎఫ్ అధ్యక్షుడు ఎం రఘుశంకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి టి లింగారెడ్డి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మూడు దశాబ్ధాలుగా విద్యను పాలకులు నిర్లక్ష్యం చేశారని తెలిపారు. దాని పర్యవసానంగా రాష్ట్రంలో అక్షరాస్యతా శాతం 66 శాతం దాటలేదని పేర్కొన్నారు. దేశంలో 32వ స్థానంలో తెలంగాణ నిలిచిందని తెలిపారు. అందుకే రాజకీయ పార్టీలు విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో కనీసం 20 శాతం నిధులు కేటాయించాలని కోరారు. అసమానతలు విద్యలో తగ్గాలంటే కామన్ స్కూల్ విధానం అమలు చేయాలని తెలిపారు. విద్యా ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేజీ టు పీజీ వరకు ప్రభుత్వరంగంలో నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను సెమి రెసిడెన్షియల్ విధానంలో నిర్వహించాలని కోరారు. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు నిరసనగా వచ్చేనెల 11న సకల ఉద్యోగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు.