Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయం చేయకపోతే దూకుతానంటూ బెదిరింపు
- ఖమ్మం జిల్లా హర్యాతండాలో నాలుగు గంటల పాటు ఉత్కంఠ
నవతెలంగాణ-ఖానాపురంహవేలీ
వారసత్వంగా వస్తున్న వ్యవసాయ భూమికి పట్టాదారు పాసుబుక్కు ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు ఇబ్బం దులకు గురిచేస్తున్నారని ఓ రైతు సెల్ టవర్ ఎక్కాడు. పాసుబుక్కు ఇవ్వకపోతే చనిపోతానంటూ రెండుగంటల పాటు ఇటు పోలీసులు...అటు అధికారులకు ముచ్చెమటలు పట్టించాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం హర్యాతండాలో మంగళవారం జరిగింది. హర్యాతండాకు చెందిన రైతు మాలోత్ రంగానాయక్కు ఈర్లపూడి రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 610, 613, 618లలో వారసత్వంగా వస్తున్న వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిని స్థానిక వీఆర్ఓ తనకు కాకుండా తన బంధువులకు పట్టాదారు పాస్ పుస్తకం చేయించి ఇచ్చాడని, తన భూమికి పాస్ పుస్తకం ఇవ్వాలని అడిగితే 'నీకు అసలు భూమే లేదు' అని చెబుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయమై నాలుగు నెలలుగా తిరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో విసుగు చెంది మంగళవారం హర్యా తండాలోని సెల్ టవర్ పైకి ఎక్కి నిరసన తెలిపాడు. పాసుబుక్కు ఇవ్వకపోతే టవర్ పై నుంచి దూకి చనిపోతానని బెదిరించాడు. రఘునాధపాలెం ఎస్ఐ క్రిష్ణ, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితునితో మాట్లాడే ప్రయత్నం చేశారు. అధికారులు ఎంత చెప్పినా కిందకి దిగి రాకపోవడంతో ఎస్ఐ క్రిష్ణ పాస్ పుస్తకం చేయించి ఇచ్చే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇవ్వడంతో రంగానాయక్ కిందకి దిగి వచ్చాడు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం బాధితుడిని తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లారు. రంగానాయక్ వద్ద ఉన్న పత్రాలను పరిశీలించి సరైన న్యాయం చేస్తామని తహసీల్దార్ కేవీ.శ్రీనివాసరావు హామీ ఇచ్చారు.