Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరువు మండలాలు ప్రకటించాలి:
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సాగర్, జంగారెడ్డి
నవతెలంగాణ-యాచారం
కరువు సహాయక చర్యలు చేపట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు టి.సాగర్, పి.జంగారెడ్డి విమర్శించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నల్లవెల్లిలో మంగళవారం తెలంగాణ రైతు సంఘం బృందం పర్యటించింది. ఎండిపోతున్న పంటలను బృంద సభ్యులు పరిశీలించారు. రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సాగర్, పి.జంగారెడ్డి మాట్లాడుతూ...రంగారెడ్డి జిల్లాలో 20 ఏండ్లుగా కరువు విలయతాండవం చేస్తోందన్నారు. 13 మండలాల్లో తీవ్ర కరువు ఉందని, వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. పశువులకు మేత లేక వాటిని కబేళాలకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు. అప్పు చేసిమరీ పత్తిపంట వేస్తే ఎకరానికి రెండు క్వింటాళ్లు కూడా రావట్లేదని వాపోయారు. దెబ్బతిన్న వాణిజ్య పంటలకు ఎకరానికి రూ.50 వేలు, ఆహార పంటలకు రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి మండల కేంద్రంలో గడ్డి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులకు ఉచితంగా సరఫరా చేయాలని కోరారు. ప్రభుత్వం జిల్లాల వారీగా కమిటీలు వేసి కరువుకు సంబంధించిన ప్రణాళికలు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేశారు. ఇతర పార్టీల నాయకులు కృష్ణా జలాలతో ఇబ్రహీంపట్నం పెద్దచెరువు నింపుతామని గొప్పలు చెప్పి ఓట్లు దండుకుని ఇప్పుడు పట్టించుకోవడం లేదన్నారు. సాగునీరు, కృష్ణా జలాల సాధన కోసం మరో ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం మాల్ పశువుల సంతలో రైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.మధుసూదన్రెడ్డి, మండలాధ్యక్షులు చంద్రయ్య, సీఐటీయూ జిల్లా నాయకులు పెండ్యాల బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.