Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. సామాజిక న్యాయం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి, అధికారం లక్ష్యంగా బహుజన లెఫ్ట్ పార్టీ (బీఎల్పీ) ఏర్పడింది. బీఎల్పీ రాష్ట్ర అధ్యక్షులుగా నల్లా సూర్యప్రకాశ్, ఉపాధ్యక్షులుగా కృష్ణస్వామి, సెక్రెటరీ జనరల్గా జలజం సత్యనారాయణతో పాటు మరో 27 మందితో కార్యవర్గాన్ని నాయకులు ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్లోని బీఎల్పీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నల్లా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ 28 పార్టీలతో కలిసి ప్రత్యామ్నాయ రాజకీయాల కోసమే బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) ఆవిర్భవించిందని చెప్పారు. ఇప్పుడు బీఎల్ఎఫ్లో బీఎల్పీ చేరడంతో పార్టీల సంఖ్య 29కి చేరిందన్నారు. సీపీఐ(ఎం) అభ్యర్థులు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు, బీఎల్పీ అభ్యర్థులు నాగలి దున్నే రైతు గుర్తుపై పోటీ చేస్తారని వివరించారు. బీఎల్ఎఫ్ ప్రకటించిన 56 మంది అభ్యర్థులను ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. ఆ నష్టాన్ని పూరించేందుకే బీఎల్ఎఫ్ వచ్చిందని అన్నారు. చాపకింద నీరులా నిశ్శబ్ద విప్లవం జరుగుతోందని చెప్పారు. బీఎల్ఎఫ్ ఆవిర్భావంతో ప్రజల్లో కదలిక వచ్చిందనీ, ఎన్నో అంశాలను చర్చించుకుంటున్నారనీ, ఆలోచిస్తున్నారనీ అన్నారు. మ్యానిఫెస్టో పేరుతో బూర్జువా పార్టీలు కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. గత ఎన్నికల్లో మ్యానిఫెస్టో ఎంత వరకు అమలైందో టీఆర్ఎస్ చెప్పడం లేదన్నారు. కేసీఆర్ మ్యానిఫెస్టో కాగితాలకే పరిమితమనీ, ఎక్కడా అమలు కాలేదనీ ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలించిన కాంగ్రెస్, టీడీపీ ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. అభివృద్ధి చేయకపోవడం వల్లే తెలంగాణ ఉద్యమం జరిగిందని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఎస్సీ,ఎస్టీలకు మూడెకరాల భూమి పంపిణీ, ఇంటింటికీ నల్లా నీళ్లు వంటి అంశాలపై కేసీఆర్ సమాధానం చెప్పడం లేదన్నారు. ప్రజలను మోసగించిన కాంగ్రెస్, టీడీపీలు మహాకూటమిని ఏర్పాటు చేశాయని అన్నారు. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోవడం వల్లే ప్రత్యామ్నాయ రాజకీయాలు, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసమే బీఎల్ఎఫ్ ఆవిర్భవించిందని చెప్పారు.
రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టిస్తామన్నారు. ఈనెల 25 తర్వాత మూడో జాబితా విడుదల చేస్తామని అన్నారు. బీఎల్పీ సెక్రెటరీ జనరల్ జలజం సత్యనారాయణ మాట్లాడుతూ బీఎల్ఎఫ్లో బీఎల్పీ భాగస్వామ్య పార్టీ అని చెప్పారు. బీఎల్ఎఫ్ ఆవిర్భావంతోనే ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకు బూర్జువా పార్టీ లు ప్రాధాన్యత ఇస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎల్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీరాముల శ్రీనివాస్, గుర్రాల సంతోష్కుమార్రెడ్డి, కార్యదర్శి శ్రీరాముల వెంకటేశ్వర్లు, కోశాధికారి విజయలక్ష్మి, సహాయ కార్యదర్శులు సౌజన్య కోట్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
బీఎల్పీ నూతన కార్యవర్గం
బీఎల్పీ రాష్ట్ర అధ్యక్షులుగా నల్లా సూర్యప్రకాశ్, సెక్రె టరీ జనరల్గా జలజం సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా కృష్ణస్వామి, భరత్ వాగ్మారే, వసీమోద్దీన్, జింకల కృష్ణయ్య, ఎఎల్ మల్లయ్య, రాజేందర్, ప్రధాన కార్యదర్శులుగా శ్రీరాముల శ్రీనివాస్, మన్నారం నాగరాజు, గుర్రాల సంతోష్కుమార్రెడ్డి, మీనయ్య, పి రాధాకృష్ణ, శ్రీనివాస్ బహదూర్, కార్యదర్శులుగా బ్రహ్మయ్య, అరుణ్కుమార్, వెంకటేశ్వర్లు, శ్రీరాముల వెంకటేశ్వర్లు, కనకం వంశీ, పుట్టా మల్లిఖార్జున్, రంజిత్కుమార్, జయరాములు, జాయింట్ సెక్రెటరీలుగా సౌజన్య కోట్యానాయక్, లింగంగౌడ్, మురళి, సంపత్, రాఘవేంద్రస్వామిగౌడ్, గుంటపల్లి సమ్మయ్య, కోశాధికారిగా ప్రొఫెసర్ విజయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.