Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంపెనీలకు లాభాలు తెస్తున్న ఎయిర్ ప్యూరిఫయర్స్ బిజినెస్
- ఏటా అమ్మకాల జోరు.. 2021లోపు 23.2 శాతం వార్షిక వృద్ధిరేటు నమోదు?!
- ఎయిర్ ప్యూరిఫయర్ల సమర్ధతపై భిన్నాభిప్రాయాలు
- నియంత్రణలేమి, క్లినికల్ గణాంకాలు లేకపోవడమే కారణం!
- దీర్ఘకాలిక చర్యలు చేపట్టాల్సిన అవసరముంది : ఎయిమ్స్ నిపుణులు
మారుతోన్న గడ్డు పరిస్థితులను చూస్తుంటే, స్వచ్ఛమైన గాలి కోసం అడవుల బాట పట్టాల్సి రావొచ్చన్న సందేహం కలుగకమానదు. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ ఒకవైపు..మరోవైపు పచ్చదనం క్షీణించటం.. వెరసి కాలుష్య రక్కసి జూలు విదిల్చి మనిషి ఆయువును తీసేస్తున్నది. మొన్నటికి మొన్న దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యతా సూచీ (ఏక్యూఐ) 337 పాయింట్లు నమోదై ఈ ఏడాదిలోనే రికార్డు స్థాయికి చేరడం అక్కడి వాతావరణ కాలుష్య తీవ్రతను తెలియజేయగా.. దేశంలో అంతకంతకూ పెరిగిపోతున్న పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని.. దీపావళి పండుగ రోజున కేవలం రెండు గంటలు మాత్రమే టపాసులు పేల్చాలని సుప్రీంకోర్టు తాజాగా స్పష్టం చేయడం గమనార్హం. ఐతే, రోజురోజుకూ ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న గాలి కాలుష్యం.. కొన్ని కంపెనీలకు లాభాలను కుమ్మరిస్తుండటం విశేషం.
సమర్ధత ఎంత?
వాయు కాలుష్యం నుంచి ప్రజలకు రక్షణ కల్పించడంలో ఎయిర్ ప్యూరిఫయర్లు ఎంత వరకు సమర్దవంతంగా పనిచేస్తాయన్న ప్రశ్నకు నిక్కచ్చి సమాధానం లేదనే చెప్పాలి. ఇంట్లోని గాలిలో ఉన్న దుమ్ము, పుప్పొడి, హైడ్రో కార్బన్లు, దుర్వాసనలను పీల్చుకొని.. శుభ్రమైన గాలిని వెదజల్లుతాయని చెప్పబడుతున్న ఎయిర్ ప్యూరిఫయర్ల సమర్ధతను చెప్పేందుకు అవసరమైన క్లినికల్ గణాంకాలేవీ ప్రస్తుతం మన దగ్గర అందుబాటులో లేవని వైద్యులతో పాటు నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. అమెరికా, యూరోప్ మాదిరిగా మన దగ్గర ఎయిర్ ప్యూరిఫయర్లపై నియంత్రణ లేదని.. వాయు కాలుష్యం నుంచి ప్రజలకు ఎన్-95 మాస్కులు, ఎయిర్ ప్యూరిఫయర్లు పూర్తిస్థాయి రక్షణ కల్పించలేవని, కనుక ఈ సంక్షోభాన్ని తొలగించేందుకు దీర్ఘకాలిక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతగానో ఉందని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) నిపుణులు గతంలో పేర్కొనడం ప్రస్తావనార్హం. కాగా, గాలి నాణ్యతా సూచీ (ఏక్యూఐ) 0 నుంచి 50 పాయింట్ల మధ్య ఉంటే వాతావరణ పరిస్థితి బాగుందని, 51 నుంచి 100 మధ్య ఉంటే పరవాలేదని, 101 నుంచి 200 పాయింట్ల మధ్య నమోదైతే ఓ మోస్తరు కాలుష్యమని.. 201 నుంచి 300 పాయింట్ల ఏక్యూఐ ఉన్న గాలి విషపూరితమని, 401 నుంచి 500 మధ్య పాయింట్స్ రికార్డ్ అయితే, అది అత్యంత ప్రమాదకర పరిస్థితిగా పరిగణిస్తారు.
అమ్మకాలు భేష్
నిన్న మొన్నటి వరకూ వాటర్ ప్యూరిఫయర్స్ మాత్రమే తెలుసు. ఇప్పుడు ఎయిర్ ప్యూరిఫయర్స్ (గాలిని శుద్ధి చేసే పరికరాలు) కూడా నగరాలతో పాటూ ద్వితీయ శ్రేణి పట్టణాల్లో సైతం తమ అమ్మకాల దూకుడుని చూపిస్తున్నాయి. ఆరంభంలో లగ్జరీ వస్తువులుగా విపణిలోకి వచ్చిన ఈ గూడ్స్.. క్రమక్రమంగా అత్యవసర వస్తువులుగా మారడంతో ఎయిర్ ప్యూరిఫయర్స్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు చందంగా మారింది. గత నవంబర్ నెలలో మెట్రో నగరాల్లో ఎయిర్ ప్యూరిఫయర్స్ అమ్మకాలు ఏకంగా మూడు రెట్లు పెరగడం విదితమే! రానున్న దీపావళి, క్రిస్టమస్, న్యూఇయర్ తదితర వేడుకల సమయంలో తమ ఎయిర్ ప్యూరిఫయర్స్ అమ్మకాలు ఐదారు రెట్లు పెరుగుతాయని పలు కంపెనీలు లెక్కలు వేస్తున్నాయి. షియోమీ, యురేకా ఫోర్బ్స్, బ్లూ ఎయిర్, పానాసోనిక్ ఇండియా, హనీవెల్, షార్ప్, ఫిలిప్స్ లాంటి సంస్థలు ఎయిర్ ప్యూరిఫయర్లను వివిధ శ్రేణులకు అనుగుణంగా అందుబాటు ధరల్లో తీసుకువస్తున్నట్టు సమాచారం. కాగా, 2016-2021మధ్య కాలంలో ఎయిర్ ప్యూరిఫయర్స్ ఇండిస్టీ వార్షిక వృద్ధి రేటు ఎంత లేదన్నా 23.2 శాతం కంటే ఎక్కువ ఉంటుందని ఫ్రాస్ట్ సర్వే అంచనా వేసింది. ఇక, ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ రకాల ఎయిర్ ప్యూరిఫయర్లు వాటి ఫీచర్లను బట్టి రూ.10 వేల నుంచి 40 వేల రూపాయల ధరకు లభ్యమవుతున్నట్టు వ్యాపారులు, డీలర్లు చెబుతున్నారు.