Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చితకబాది.. ఆపై టవల్తో మెడకు ఉరి
- ఖమ్మం గిరిజన ఆశ్రమ హాస్టల్లో ఘటన..
- హెచ్ఎం, వార్డెన్ను సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్
నవతెలంగాణ- ఖమ్మం
వారిద్దరూ ఒకే హాస్టల్లో ఉంటూ.. వేర్వేరు తరగతులు చదువుతున్నారు. అందులో ఓ విద్యార్థి నాలుగు, మరో విద్యార్థి స్థానిక ప్రయివేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఇద్దరి మధ్య తలెత్తిన చిన్న వివాదంతో జూనియర్ విద్యార్థిని సీనియర్ విద్యార్థి తీవ్రంగా కొట్టి ఉరేశాడు. ఈ విషాద ఘటన ఖమ్మం నగరంలోని ప్రభుత్వ గిరిజన పాఠశాల హాస్టల్లో మంగళవారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఖమ్మం టూ టౌన్ సీఐ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం ఖానాపురానికి చెందిన దనవత్తు జోసెఫ్(10) ఖమ్మంలోని ఎన్ఎస్టీ రోడ్డులో గల గిరిజన ఆశ్రమ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన హరిమాధవ్ కూడా గిరిజన పాఠశాల హాస్టల్లోనే ఉంటూ ఖమ్మంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం జోసెఫ్, హరిమాధవ్ల మధ్య చిన్న ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరినొకరు తిట్టుకుంటూ మాటామాట పెరిగి కొట్టుకున్నారు. జోసెఫ్ను హరిమాధవ్ విచక్షణారహితంగా చితకబాది అదే గదిలో టవల్తో మెడకు బిగించడంతో మతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి మార్చురీకి తరలించారు.
హెచ్ఎం, వార్డెన్లను సస్పెండ్ చేయాలి : ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్
హాస్టల్లో విద్యార్థుల మధ్య గొడవ జరుగుతున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించిన హెచ్ఎం, వార్డెన్లను వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చింతల రమేష్, టీ.నాగరాజు, ఏఐ ఎస్ఎఫ్ నాయకులు జాగర్లమూరి రంజిత్కుమర్, రామకృష్ణ డిమాండ్ చేశారు. హాస్టల్లో విద్యార్థులు కొంతకాలంగా గొడవలు పడుతున్నా పట్టించుకోకపోవడంతో విద్యార్థి మరణానికి దారితీసిందన్నారు.