Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 90 సీట్లకు తగ్గకుండా పోటీ
- కాంగ్రెస్ నేతల నిర్ణయం
- టీడీపీకి 12, సీపీఐకి 5 కేటాయించాలని యోచన
- కూటమి పార్టీలతో కీలక చర్చలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
సీట్ల పంపకాల విషయంలో భాగస్వామ్య పార్టీల మధ్య రాజీ ధోరణి కనిపిస్తున్నది. 12 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని టీజేఎస్ మంగళవారం ప్రతిపాదించి నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. 17 లోక్సభ నియో జకవర్గాల్లో ఒక్కొక్క సీటు చొప్పున 17 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని కోరిన ఆపార్టీ మరో 5 సీట్లను తగ్గించుకున్నది. టీజేఎస్కు 12 సీట్లు కేటాయించటానికి కాంగ్రెస్ పెద్దలు కూడా సానుకూలత వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. అయితే టీజేఎస్ కోరుతున్న ఉత్తర తెలంగాణలోని కొన్ని స్థానాల విషయంలో కూటమి పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సి ఉన్నది. తెలుగుదేశం పార్టీకి 12, సీపీఐకి 5 స్థానాలు కేటాయించి మిగిలిన 90 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీచేయాలని ఆ పార్టీ సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూటమి విచ్ఛిన్నం కాకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఢిల్లీ పెద్దలు చెప్పటంతో బేరసారాల్లో ఆచితూచి వ్యవహరించాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కూడా భావిస్తున్నారు. సీట్ల కేటాయింపుల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరి పట్ల టీజేఎస్, సీపీఐ పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ కూటమి నుంచి బయటికి వచ్చే ఆలోచన తమకు లేదని ఆ రెండు పార్టీల నేతలు స్పష్టం చేస్తున్నారు. సీట్ల పంపకాల వ్యవహారాన్ని 24 లోగా తేల్చక పోతే తమ పార్టీ రాష్ట్ర సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటామని టీజేఎస్ హెచ్చరించింది. రాష్ట్ర కార్యవర్గ సమాపవేశాన్ని బుధవారం నిర్వహించాలనుకున్న ఆ పార్టీ ఈ సమావేశాన్ని గురువారానికి వాయిదా వేసింది. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ బుధవారం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. సీట్ల సర్దుబాటు విషయంలో పట్టు విడుపులతో వ్యవహరించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. 15 సీట్లు కావాలని కోరిన ఆ పార్టీ ఇప్పుడు 14 సీట్లకు పరిమితం కావాలని నిర్ణయించింది. టీడీపీకి 12 సీట్లు ఇవ్వటానికి కాంగ్రెస్ నేతలు ఇప్పటికే అంగీకరించారు. అదనంగా ఖైరతాబాద్, జూబ్లిహిల్స్ స్థానాల కోసం టీడీపీ పట్టు పడుతున్నది. సీపీఐ 9 స్థానాలు కోరుతుండగా రెండు లేదా మూడు స్థానాలు కేటాయిస్తామని కాంగ్రెస్ నేతలు లీక్లు ఇవ్వటంతో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ అసంతృప్తి వ్యక్తం చేశారు.రెండు మూడు సీట్లు తీసుకోవటం ఆత్మహత్యా సదృశంగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. సీపీఐకి 5 సీట్లు ఇవ్వటానికి కాంగ్రెస్ నేతలు సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది. సీట్ల పంపకాల కోసం కూటమి పార్టీలు సమావేశం కాక పోవటంతో ఆయా పార్టీల శ్రేణుల్లో అసహనం పెరుగుతున్నది. మిత్ర పక్షాలకు కేటాయించే సీట్ల విషయంలో స్పష్టత వస్తేనే కాంగ్రెస్ అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ కూడా వేగవంతం అయ్యే అవకాశం ఉన్నది. కూటమి పార్టీల సీట్ల వ్యవహారం రెండ్రోజుల్లో కొలిక్కి వస్తుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి కూడా మంగళవారం ప్రకటించారు.
జనసమితికి అగ్గిపెట్టె గుర్తు..
తెలంగాణ జనసమితి పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ అగ్గిపెట్టె గుర్తును కేటాయించింది. అయితే, తమకు తెలంగాణను ప్రతిబింబించే విధంగా పాలపిట్టతోపాటు మరో రెండు గుర్తులను టీజేఎస్ ఈసీకి దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. వాటికి బదులు కత్తెర, ఈల వంటి గుర్తులను ఈసీ కేటాయించింది. వీటిని ఆ పార్టీ తిరస్కరించింది. ఈసీ అగ్గిపెట్టె గుర్తును కేటాయించడంతో టీజేఎస్ హర్షం వ్యక్తం చేసింది.